TS News: ఎమ్మెల్సీ కవితకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చురకలు
ABN, First Publish Date - 2023-03-09T18:03:31+05:30
సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ (ED) విచారణకు పీలుస్తుందా? ఇంటికి వచ్చి విచారించాలని అంటున్నారని ఆయన మండిపడ్డారు.

ఢిల్లీ: సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ (ED) విచారణకు పీలుస్తుందా? ఇంటికి వచ్చి విచారించాలని అంటున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం (CM) కుటుంబానికి ఒక చట్టం, సామాన్య కుటుంబానికి ఒక చట్టం ఉంటుందా? అని ప్రశ్నించారు. సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. నేరస్థులు ఎవరైనా జైల్కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తాము భయడదే లేదు అంటున్నారు, ఎవరు భయపడమని చెప్పారని ఎద్దేవా చేశారు.
ఇదిలాఉండగా... ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor scam)తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha) తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. లిక్కర్ స్కామ్పై అన్నా చెల్లెలు (KTR, Kavitha) ఇద్దరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన కేటీఆర్, కవితలను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలను మించినవారు లేరని కిషన్రెడ్డి చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి లిక్కర్ స్కామ్ చేయాలని చెప్పామా అంటూ ఆయన కేటీఆర్, కవిత(KTR, Kavitha)లను ఉద్దేశించి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కల్వకుంట్ల ఫ్యామిలీకి లేదన్నారు. లిక్కర్ స్కామ్పై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో ధర్నా నాటకాలు ఆడుతున్నారని, సానుభూతి కోసమే బీఆర్ఎస్ డ్రామాలాడుతోందని కిషన్ రెడ్డి చెప్పారు.
మద్యం కేసు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తుకొచ్చిందా అని కిషన్రెడ్డి ఎమ్మెల్సీ కవితను ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. లక్షల విలువైన సెల్ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేయాల్సినంత గొప్పవాళ్లు కాదని కిషన్ రెడ్డి చెప్పారు. అక్రమ వ్యాపారంలో ఇరుక్కుపోయి, అక్రమాలు చేస్తూ మోదీని తప్పుపడతారా అని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు.
అంతకు ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi liquor scam)లో ఈడీ నోటీసులపై ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC K Kavitha) స్పందించారు. 9న విచారణకు రావాలని ఈడీ(ED) నోటీసు ఇచ్చిందని, 11న విచారణకు తమ ఇంటికి రమ్మని ఈడీని కోరానన్నారు. ఈమేరకు ఈడీకి సమాచారం ఇచ్చినా ఈడీ ఒప్పుకోలేదన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు విచారించరని కవిత ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారించాలన్నది చట్టం చెబుతోందని, మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఇది తన ఒక్క సమస్యే కాదని, ఈడీ ఎందుకింత హడావుడిగా దర్యాప్తు చేస్తుందో అర్థం కావడం లేదని కవిత చెప్పారు. తనతోపాటు ఎవర్ని విచారించినా తనకు ఇబ్బంది లేదన్నారు.
Updated Date - 2023-03-09T18:03:35+05:30 IST