Share News

రవాణా శాఖలో అక్రమ వసూళ్లపై విచారణ

ABN , Publish Date - Aug 20 , 2024 | 06:50 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిగ్గు తేలుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రవాణా శాఖలో అక్రమ వసూళ్లపై విచారణ

  • దీనిలో ఒక అధికారిది కీలక పాత్ర

  • దర్యాప్తులో అందరి పాత్ర బయటపడుతుంది

  • అక్రమాలు బయటపడతాయనే ఫైళ్ల దగ్ధం ఘటనలు: అచ్చెన్న

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిగ్గు తేలుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

‘రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విడగొట్టి ఒక్కో జోన్‌కు ఒక్కో అధికారిని పెట్టి మరీ అక్రమ వసూళ్లు చేశారు. ఇసుక, మైనింగ్‌, రేషన్‌ బియ్యం, అక్రమ మద్యం... ఇలా దేనినీ వదలకుండా ప్రతి అక్రమ రవాణాకు సహకరించి దానికి బదులుగా భారీగా వసూళ్లు చేశారు. ఈ దందాకు ఒక ఉన్నతాధికారి పూర్తి అండదండలు ఇచ్చాడు. కీలక పాత్ర పోషించాడు.

ఆయన పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ దుర్మార్గాలపై విచారణ వేస్తున్నాం. అందులో అందరి పాత్రలు బయటకు వస్తాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు’ అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అనేక దుర్మార్గాలకు పాల్పడిన అధికారులు, వారి కింద తాబేదారులు తమ తప్పులు బయటకు రాకుండా చూడటానికి కార్యాలయాల్లో ఫైళ్లు తగలబెట్టడాన్ని ఒక మార్గంగా ఎంచుకొన్నారని ఆయన ఆరోపించారు. అందుకే గత కొద్ది రోజుల్లో ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయని తెలిపారు. ‘గత ఐదేళ్ల అక్రమాలను వెలికితీస్తామని మేం చెప్పిన తర్వాత భయంతో రికార్డులు తగలబెడుతున్నారు.


పోలవరం ప్రాజెక్టు కింద అసలు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా వైసీపీ నేతలకు, వారి అనుచరులకు అడ్డగోలుగా దోచిపెట్టారు. దీని కోసం తప్పుడు రికార్డులు సృష్టించారు. ఇవి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడంతో ఆ పైళ్లను తగలబెట్టారు. తిరుపతిలో కూడా స్వామి వారి ధనాన్ని అందినకాడికి దోచుకొన్నారు. కోట్లు స్వాహా చేశారు. అవన్నీ బయటకు వస్తాయన్న భయంతో అక్కడ కూడా రికార్డులు తగలబెట్టారు.

పైళ్లను తగలబెడుతున్న వ్యవహారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియ్‌సగా తీసుకొన్నారు. దీనికి బాధ్యులైన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదు. కఠినంగా ఉండబోతున్నాం’ అని అచ్చెన్న చెప్పారు. జగనన్న భూ సర్వే బోగస్‌ సర్వేగా మారిందని, అడ్డగోలుగా రికార్డులు మార్చడానికి దానిని వాడుకొన్నారని మంత్రి విమర్శించారు. ‘సర్వే పేరుతో ప్రజల మధ్య తగాదాలు పెట్టారు.

కొత్త సమస్యలు సృష్టించారు. వారసత్వంగా వచ్చిన భూములు వారి ఆధీనంలోనే ఉన్నా రికార్డుల్లో పేర్లు మార్చివేశారు. దీనితో గ్రామాల్లో ఒకరిపై తగాదాలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వ్యవస్ధలను చిన్నాభిన్నం చేసింది. వినతుల స్వీకరణ కార్యక్రమం ఎక్కడ పెట్టినా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి’ అని ఆయన చెప్పారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు గతంలో ఎండీగా చేసిన వాసుదేవరెడ్డి అవినీతి వ్యవహారాలపై అనేక ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ జరుగుతోందని తెలిపారు.

Updated Date - Aug 20 , 2024 | 06:50 AM