Share News

Chandrababu: వినతులు ఎన్ని ఉన్నా.. పరిష్కారమే లక్ష్యం!

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:09 PM

వినతులు ఎన్ని ఉన్నా.. అన్నిటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ చేశారు.

Chandrababu: వినతులు ఎన్ని ఉన్నా.. పరిష్కారమే లక్ష్యం!
CM Nara Chandrababu Naidu

అమరావతి: వినతులు ఎన్ని ఉన్నా.. అన్నిటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ చేశారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందన్నారు. రికార్డులు కూడా తారుమారు చేశారన్నారు. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు వెల్లడించారు.


ప్రతీ జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూశాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అని చంద్రబాబు తెలిపారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. వినతులు ఎక్కువ తీసుకోవటంతో పాటు ఎక్కువ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతీ ఒక్కరి సమస్యా సాధ్యమైనంత త్వరగా పరీష్కరిస్తామన్నారు. వచ్చిన వినతులన్నీ శాఖల వారీగా విభజించి నిర్థిష్ట కాలపరిమితి లోపు వాటి పరిష్కారమయ్యేలా కార్యాచరణ రూపొందించుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారన్నారు.


కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా వేటికవి విభజించి పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకూ రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా యంత్రాంగం రూపొందిస్తున్నామన్నారు. జిల్లాల్లో నా పర్యటనల సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తామన్నారు. పోలీసు వ్యవస్థ సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థగా మారుస్తామన్నారు. వర్షాలు పడి ప్రాజెక్టులు కూడా నిండటంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. శాఖల వారీ సమీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 01:23 PM