రైల్వేస్టేషన్లో ఇంకొన్నాళ్లు ఇబ్బందులే...
ABN , Publish Date - Apr 12 , 2024 | 01:24 AM
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలకు ప్రయాణికులు మరి కొన్నాళ్లు ఇబ్బందులు పడాల్సి వచ్చేలా ఉంది.

కుంగినచోట ఫుట్ ఓవర్ బ్రిడ్జి తొలగింపు
పునరుద్ధరణకు మరికొంత సమయం
మిగిలిన ఫుట్ బ్రిడ్జిలను పరిశీలిస్తున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలకు ప్రయాణికులు మరి కొన్నాళ్లు ఇబ్బందులు పడాల్సి వచ్చేలా ఉంది. నాలుగు రోజుల క్రితం దక్షిణం వైపు మూడో గేటుకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుంగిపోయిన సంగతి తెలిసిందే. రైల్వేస్టేషన్లలో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. ఎక్కడో గానీ జరగవు. విశాఖపట్నం వంటి రద్దీ రైల్వేస్టేషన్లో ఇలాంటి ప్రమాదం జరగడం రైల్వే వర్గాలనే నివ్వెరపరిచింది. నాణ్యతాలోపం, నిర్వహణ లోపం ఉంటే తప్ప ఇలాంటివి చోటుచేసుకోవు. రైల్వేస్టేషన్ ఆధునికీకరించామని, నంబర్వన్ స్టేషన్గా అభివృద్ధి చేశామని చెప్పుకొనే అధికారులు ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం జరిగిందనే దానిపై ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ కుంగిందే తప్ప కూలిపోలేదని, అలా జరిగి ఉంటే భారీ ప్రమాదమే సంభవించి ఉండేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుంగిపోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవని, 24 గంటల్లో అన్నీ పునరుద్ధరిస్తామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా సఫలీకృతం కాలేకపోయారు. రెండు రోజుల తరువాత 3, 4 ప్లాట్ఫారాల పైకి రైళ్లను రప్పించగలిగారు. కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తక్షణమే పునర్నిర్మాణం చేయలేకపోయారు. దీనికి కనీసం పది రోజులకుపైగా సమయం పడుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ బ్రిడ్జిని 3, 4 ప్లాట్ఫారాలపై పూర్తిగా కట్ చేసి తీసేశారు. కొత్తది వేయాలంటే...కింద బలమైన ఐరన్ పిల్లర్లు వేయాల్సి ఉంది. వాటితో పాటు పైన మళ్లీ సుమారుగా 20 మీటర్ల పొడవున వంతెన ఏర్పాటు చేసి, అది ఎంత బరువు కాస్తుందో పరిశీలించాల్సి ఉంది. అదే సమయంలో మిగిలిన పుట్ ఓవర్ బ్రిడ్జిల పనితీరు, సామర్థ్యం కూడా పరిశీలిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదంతో రైల్వే స్టేషనలో జరుగుతున్న పనుల నాణ్యత, నిర్వహణపరమైన అంశాలపై తొలిసారిగా అనుమానాలు తలెత్తాయి. వాటిపైనే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.