Share News

దేశీయ వాహన కంపెనీల ఈ-రష్‌!

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:31 AM

వచ్చే 6-8 నెలల్లో మార్కెట్లోకి పలు కొత్త మోడళ్ల విడుదల ఎలక్ట్రిక్‌ కార్ల (ఈవీ) విభాగంలోనూ పోటీ వేడెక్కుతోంది. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ, వోల్వో వంటి అంతర్జాతీయ లగ్జరీ కార్ల...

దేశీయ వాహన కంపెనీల ఈ-రష్‌!

బడా ఎస్‌యూవీల ఎలక్ట్రిఫికేషన్‌పై దృష్టి

వచ్చే 6-8 నెలల్లో మార్కెట్లోకి పలు కొత్త మోడళ్ల విడుదల ఎలక్ట్రిక్‌ కార్ల (ఈవీ) విభాగంలోనూ పోటీ వేడెక్కుతోంది. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ, వోల్వో వంటి అంతర్జాతీయ లగ్జరీ కార్ల బ్రాండ్లను మినహాయిస్తే, దేశీయ మార్కెట్లో అధికంగా హ్యాచ్‌బ్యాక్‌, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడళ్లలోనే ఎలక్ట్రిక్‌ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో మరో మెట్టెక్కేందుకు వాహన సంస్థలు మిడ్‌సైజ్‌, బడా ఎస్‌యూవీ మోడళ్లలోనూ ఈ-వెర్షన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. టాటా మోటార్స్‌, మహీం ద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), హ్యుండయ్‌, కియా, మారుతి సుజుకీ, జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ వచ్చే 6-8 నెలల్లో పలు ఈ-ఎ్‌సయూవీలను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.


టాటాదే హవా

నెక్సాన్‌, పంచ్‌, టియాగో, టిగోర్‌ ఈవీ వెర్షన్లతో దేశీయ ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో దాదాపు 70 శాతం మార్కెట్‌ వాటాను చేజిక్కించుకున్న టాటా మోటార్స్‌ తన ఈ-పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా ఎస్‌యూవీ హారియర్‌లోనూ ఈవీ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సంస్థ సిద్ధమవుతోంది. సంప్రదాయ ఇంధన ఇంజన్‌తో కూడిన హారియర్‌ ఎక్స్‌షోరూమ్‌ కనీస ధర రూ.17 లక్షల స్థాయిలో ఉంది. హారియర్‌ ఈవీ రేటు ప్రారంభ రేటు రూ.22-25 లక్షల స్థాయిలో ఉండవచ్చని అంచనా. కాగా, టాటా మోటార్స్‌ త్వరలో విడుదల చేయనున్న క్రాసోవర్‌ వెహికిల్‌ ‘కర్వ్‌’లో సంప్రదాయ ఇంజన్‌ వేరియంట్లతో పాటు ఈవీ వెర్షన్‌ను సైతం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిసింది.

మార్చి నాటికి హ్యుండయ్‌ క్రెటా

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా తన బెస్ట్‌ సెల్లింగ్‌ మోడళ్లలో ఒకటైన క్రెటాలో ఎలక్ట్రిక్‌ వేరియంట్‌ను వచ్చే మార్చి నాటికి మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ‘ఈవీ 6’ మోడల్‌ను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోన్న కియా.. త్వరలో ‘ఈవీ 9’ను లాంచ్‌ చేయనుంది. దీని ధర రూ.కోటి స్థాయిలో ఉండవచ్చని అంచనా. జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్‌ ప్రస్తుతం జెడ్‌ఎస్‌, కోమెట్‌ ఈవీలను అందుబాటులోకి తెచ్చింది. క్లౌడ్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ క్రాసోవర్‌ యుటిలిటీ వెహికిల్‌ను త్వరలో విడుదల చేయనుంది. దాని ధర రూ.20 లక్షల స్థాయి లో ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీ

మరో దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన ఎస్‌యూవీ మోడల్‌ ‘ఎక్స్‌యూవీ 700’లో ఈ-వెర్షన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ధరను రూ.20 లక్షల లోపే నిర్ణయించే అవకాశం ఉంది. ఆ తర్వాత కంపెనీ బోర్న్‌ ఎలక్ట్రిక్‌ మోడల్‌ ‘బీఈ 05’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా సైతం ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈవీఎక్స్‌ కాన్సెప్ట్‌ ఆధారిత ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మోడల్‌ను కంపెనీ వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది. దాని ధరను రూ.10-15 లక్షల స్థాయిలో నిర్ణయించే అవకాశముంది. అంతర్జాతీయ లగ్జరీ కార్ల బ్రాండ్ల విషయానికొస్తే, మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ వెర్షన్లను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ఎలక్ట్రిఫికేషన్‌లో ఈ రెండు కంపెనీలు మిగతా లగ్జరీ బాండ్ల కంటే ముందున్నాయి. భారత్‌లో ఈక్యూ ఎస్‌ లగ్జరీ సెలూన్‌, ఈక్యూ బీ, ఈక్యూ ఈ ఎలక్ట్రిక్‌ మోడళ్లను విక్రయిస్తోన్న బెంజ్‌.. ఈ ఆగస్టులో ఈక్యూ ఏ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది.

Updated Date - Jun 23 , 2024 | 06:31 AM