Share News

భారత్‌ సూపర్‌ బోణీ

ABN , Publish Date - Jun 21 , 2024 | 02:03 AM

టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా అజేయ ఆటతీరు కొనసాగుతోంది. ఓటమనేదే లేకుండా గ్రూప్‌ దశను దాటిన రోహిత్‌ సేన.. కీలక సూపర్‌-8లోనూ అదిరే బోణీ చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు అర్ధసెంచరీ (28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53)తో ఆకట్టుకోగా...

భారత్‌ సూపర్‌ బోణీ

సూర్యకుమార్‌ అర్ధసెంచరీ

  • బుమ్రా స్పెల్‌ అదుర్స్‌

  • అఫ్ఘానిస్థాన్‌ చిత్తు

  • టీ20 వరల్డ్‌కప్‌

బ్రిడ్జిటౌన్‌: టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా అజేయ ఆటతీరు కొనసాగుతోంది. ఓటమనేదే లేకుండా గ్రూప్‌ దశను దాటిన రోహిత్‌ సేన.. కీలక సూపర్‌-8లోనూ అదిరే బోణీ చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు అర్ధసెంచరీ (28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53)తో ఆకట్టుకోగా.. ఆ తర్వాత స్టార్‌ పేసర్‌ బుమ్రా (4-1-7-3) సూపర్‌ బౌలింగ్‌తో కట్టుదిట్టం చేశాడు. దీంతో గ్రూప్‌ 1లో భాగంగా గురువారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. తమ రెండో మ్యాచ్‌ను శనివారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32), విరాట్‌ (24 బంతుల్లో 1 సిక్స్‌తో 24), పంత్‌ (11 బంతుల్లో 4 ఫోర్లతో 20) ఫర్వాలేదనిపించారు. రషీద్‌, ఫరూఖిలకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (26), జద్రాన్‌ (19) మాత్రమే రాణించారు. అర్ష్‌దీ్‌పనకు మూడు, కుల్దీ్‌పనకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు.


బౌలర్ల కట్టడి: ఈ పిచ్‌పై కష్టసాధ్యమైన ఛేదన కోసం బరిలోకి దిగిన అఫ్ఘాన్‌ ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. భారత పేసర్లు, స్పిన్నర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా బుమ్రా 20 డాట్‌ బాల్స్‌తో బెంబేలెత్తించాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ గుర్బాజ్‌ (11) 4,6తో దూకుడు చూపినా, తను రెండో ఓవర్‌లోనే బుమ్రా చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్‌ (8)ను అక్షర్‌.. మరో ఓపెనర్‌ హజ్రతుల్లా (2)ను బుమ్రానే అవుట్‌ చేయడంతో పవర్‌ప్లేలో అఫ్ఘాన్‌ 35/3 స్కోరుతో నిలిచింది. ఈ స్థితిలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌, నయీబ్‌ (17) నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఆశలు రేపారు. కానీ ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో కుల్దీప్‌, జడేజా పెవిలియన్‌కు చేర్చారు. అప్పటికి స్కోరు 71/5. 16వ ఓవర్‌లో బుమ్రా నజీబుల్లాను అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు నబీ (14)తో కలిసి చేసిన 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం పేసర్‌ అర్ష్‌దీప్‌ ధాటికి టెయిలెండర్లు టపటపా పెవిలియన్‌కు చేరడంతో అఫ్ఘాన్‌ ఓటమి ఖరారైంది.


సూర్య-హార్దిక్‌ అండగా..: టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఆరంభంలో పరుగులు లభించడం కష్టమైంది. అయితే మధ్య ఓవర్లలో సూర్యకుమార్‌, హార్దిక్‌ ధాటిగా ఆడడంతో జట్టు సవాల్‌ విసిరే స్కోరందుకుంది. కానీ డెత్‌ ఓవర్లలో టపటపా వికెట్లను కోల్పోవడం జట్టు భారీ స్కోరు పై ప్రభావం పడింది. ఓపెనర్లు రోహిత్‌ (8), విరాట్‌లను అఫ్ఘాన్‌ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. లెఫ్టామ్‌ పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో రోహిత్‌ వైఫల్యం ఈసారి కూడా బయటపడింది. మూడో ఓవర్‌లోనే రోహిత్‌ను ఫరూఖి పెవిలియన్‌కు చేర్చి షాకిచ్చాడు. తన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ శర్మ 13, 3తో నిరాశపరిచాడు. అయితే ఐదో ఓవర్‌లో విరాట్‌ సిక్సర్‌.. ఆరో ఓవర్‌లో పంత్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో జట్టు పవర్‌ప్లేలో 47/1 స్కోరు సాధించగలిగింది. ఈ ఇద్దరూ కుదురుకుంటే భారీ స్కోరు ఖాయమనిపించినా.. స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ వరుస ఓవర్లలో భారత్‌ను వణికించాడు. స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపిస్తున్న పంత్‌ను మొదట ఏడో ఓవర్‌లో అవుట్‌ చేయగా రెండో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

ఆ తర్వాత విరాట్‌, శివమ్‌ దూబే (10)ల పనిబట్టడంతో భారత్‌ 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యకుమార్‌, హార్దిక్‌ అఫ్ఘాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 13వ ఓవర్‌లో సూర్య రెండు ఫోర్లు బాదాడు. ఇందులో తక్కువ ఎత్తులో వేసిన ఓ వైడ్‌ బంతిని స్క్వేర్‌ లెగ్‌ వైపు ఫోర్‌గా మల్చడం అబ్బురపరిచింది. అటు హార్దిక్‌ 16వ ఓవర్‌లో 4,6తో జోరు చూపాడు. తర్వాతి ఓవర్‌లోనే సూర్య 6,4తో 26 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పటికీ ఆ వెంటనే వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు హార్దిక్‌ సైతం 18వ ఓవర్‌లో సిక్సర్‌ బాది నవీనుల్‌ చేతికి చిక్కాడు. జడేజా (7) విఫలం కాగా, ఆఖరి ఓవర్‌లో అక్షర్‌ (12) రెండు ఫోర్లతో జట్టు స్కోరు 180 దాటింది.


స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) రషీద్‌ (బి) ఫరూఖి 8, కోహ్లీ (సి) నబీ (బి) రషీద్‌ 24, పంత్‌ (ఎల్బీ) రషీద్‌ 20, సూర్యకుమార్‌ (సి) నబీ (బి) ఫరూఖి 53, శివమ్‌ దూబే (ఎల్బీ) రషీద్‌ 10, హార్దిక్‌ (సి) అజ్మతుల్లా (బి) నవీనుల్‌ 32, జడేజా (సి) గుల్బదిన్‌ (బి) ఫరూఖి 7, అక్షర్‌ (రనౌట్‌) 12, అర్ష్‌దీప్‌ (నాటౌట్‌) 2 ; ఎక్స్‌ట్రాలు : 13 ; మొత్తం 20 ఓవర్లలో 181/8 ; వికెట్లపతనం : 1-11, 2-54, 3-62, 4-90, 5-150, 6-159, 7-165, 8-181 ; బౌలింగ్‌: ఫరూఖి 4-0-33-3, మహ్మద్‌ నబి 3-0-24-0, నవీనుల్‌ 4-0-40-1, రషీద్‌ 4-0-26-3, నూర్‌ అహ్మద్‌ 3-0-30-0, అజ్మతుల్లా 2-0-23-0.

అఫ్ఘానిస్థాన్‌: రహ్మనుల్లా (సి) పంత్‌ (బి) బుమ్రా 11, హజ్రతుల్లా (సి) జడేజా (బి) బుమ్రా 2, ఇబ్రహీం జద్రాన్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 8, నైబ్‌ (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 17, అజ్మతుల్లా (సి) అక్షర్‌ (బి) జడేజా 26, నజీబుల్లా (సి) అర్ష్‌దీప్‌ (బి) బుమ్రా 19, నబీ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 14, రషీద్‌ (సి) జడేజా (బి) అర్ష్‌దీప్‌ 2, నూర్‌ అహ్మద్‌ (సి) రోహిత్‌ (బి) అర్ష్‌దీప్‌ 12, నవీనుల్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, ఫరూఖి (నాటౌట్‌) 4 ; ఎక్స్‌ట్రాలు : 19 ; మొత్తం 20 ఓవర్లలో 134 ఆలౌట్‌ ; వికెట్లపతనం : 1-13, 2-23, 3-23, 4-67, 5-71, 6-102, 7-114, 8-121, 9-121 ; బౌలింగ్‌ : అర్ష్‌దీప్‌ 4-0-36-3, బుమ్రా 4-1-7-3, అక్షర్‌ 3-1-15-1, హార్దిక్‌ 2-0- 13-0, కుల్దీప్‌ 4-0-32-2, జడేజా 3-0-20-1.


నల్ల రిబ్బన్లతో బరిలోకి..

అఫ్ఘాన్‌తో సూపర్‌-8 మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లంతా తమ భుజాలకు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. మాజీ పేసర్‌ డేవిడ్‌ జాన్సన్‌ గురువారం మృతి చెందగా.. అతడికి ఘనంగా నివాళి అర్పించేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

1

టీ20ల్లో భారత్‌ తరఫున ఎక్కువ పరుగులు (4066) చేసిన విరాట్‌. రోహిత్‌ (4050)ను అధిగమించాడు. ఓవరాల్‌గా బాబర్‌ ఆజమ్‌ (4145) టాప్‌లో ఉన్నాడు.

Updated Date - Jun 21 , 2024 | 02:03 AM