Share News

Congress: గుర్తులో పీవీ ‘హస్తం’.. కష్టాల్లో కాకా ‘ఆశ్రయం’

ABN , Publish Date - May 13 , 2024 | 05:31 AM

కాంగ్రెస్‌ పార్టీ అంటే మనందరికీ గుర్తొచ్చేది ‘హస్తం’. వందేళ్లపైగా చరిత్ర ఉన్న ఆ పార్టీ తొలి గుర్తు ఆవు దూడ. ఎమర్జెన్సీ తర్వాత.. 1978లో ఇందిరాగాంధీ అధికారం, పార్టీ, పార్టీ కార్యాలయం అన్నిటినీ తన చేతి నుంచి కోల్పోయారు. పెద్ద నాయకులూ హ్యాండ్‌ ఇచ్చారు. వెంట ఉన్న కొద్దిమందితో కొత్త పార్టీ పెట్టాలనుకున్నారు. ఇరువర్గాల వివాదంతో ఆవుదూడ గుర్తును ఈసీ స్తంభింపజేసింది. 1

Congress: గుర్తులో పీవీ ‘హస్తం’.. కష్టాల్లో కాకా ‘ఆశ్రయం’

(ఆంధ్రజ్యోతి, గల్ఫ్‌ ప్రతినిధి)

కాంగ్రెస్‌ పార్టీ అంటే మనందరికీ గుర్తొచ్చేది ‘హస్తం’. వందేళ్లపైగా చరిత్ర ఉన్న ఆ పార్టీ తొలి గుర్తు ఆవు దూడ. ఎమర్జెన్సీ తర్వాత.. 1978లో ఇందిరాగాంధీ అధికారం, పార్టీ, పార్టీ కార్యాలయం అన్నిటినీ తన చేతి నుంచి కోల్పోయారు. పెద్ద నాయకులూ హ్యాండ్‌ ఇచ్చారు. వెంట ఉన్న కొద్దిమందితో కొత్త పార్టీ పెట్టాలనుకున్నారు. ఇరువర్గాల వివాదంతో ఆవుదూడ గుర్తును ఈసీ స్తంభింపజేసింది. 1978 ఫిబ్రవరి 2న చెయ్యి, సైకిల్‌, ఏనుగు గుర్తుల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరింది. ఢిల్లీ నుంచి బూటాసింగ్‌ ట్రంక్‌ కాల్‌ చేసి ఏ గుర్తు ఎంచుకుందామని ఏపీలోని మదనపల్లె పర్యటనలో ఉన్న ఇందిరను అడిగారు. హిందీలో హాత్‌ అంటే చేయి, హాతీ అంటే ఏనుగు. ట్రంక్‌ కాల్‌లో సరిగా వినిపించకపోవడంతో.. ఫోన్‌ను పక్కన ఉన్న పీవీ నరసింహారావుకు ఇచ్చారు ఇందిర. ఆయన స్పష్టంగా అర్థం చేసుకుని చెప్పాక.. ఇందిర హస్తం గుర్తును ఎంచుకున్నారు. అయితే, ‘సైకిల్‌’ను తర్వాత నాలుగేళ్లకు తెలుగునాట ఆవిర్భవించిన టీడీపీకి, ‘ఏనుగు’ను మరికొన్నేళ్లకు పుట్టిన బీఎస్పీకి కేటాయించడం.. ఈ రెండు పార్టీలు చరిత్ర సృష్టించడం వేరే సంగతి.


కాకా.. పెద్ద మనసు

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం అంటే గుర్తొచ్చే పేరు ఢిల్లీలోని 24 అక్బర్‌ రోడ్‌. ఇందిర కష్టాల్లో ఉన్న దశలో ఆ పార్టీకి కార్యాలయమే లేని పరిస్థితి ఎదురైంది. దీంతో 24 అక్బర్‌ రోడ్‌లోని తన నివాసాన్ని ఇచ్చేశారు కేంద్ర మాజీ మంత్రి, దివంగత జి.వెంకటస్వామి (కాకా). తెలంగాణ నుంచి పలుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆయన 1970ల చివరికే సీనియర్‌ పార్లమెంటేరియన్‌. దీంతో ఖాళీ స్థలంతో కూడిన పెద్ద బంగ్లాను కేటాయించారు. తొలుత కాకాకు చెప్పకుండానే ఈ బంగ్లాను ఆయన అన్న కుమారుడు, అప్పటి మేడారం ఎమ్మెల్యే ఈశ్వర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అప్పగించారు. కొద్ది రోజులకు ఢిల్లీకి వచ్చిన వెంకటస్వామికి ఈ సంగతి తెలిసినా.. ‘‘నాకు పదవులు, హోదా అంతా ఇందిర ఇచ్చిన బిక్ష. పార్టీ కోసం బంగ్లాను వదులుకోవడంతో నా జన్మ ధన్యమైంది’’ అని సంతోషపడ్డారు. ప్రస్తుతం కాకా ఇద్దరు కుమారులు ఎమ్మెల్యేలుగా ఉండగా, ఆయన మనవడు వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది కాకా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే కావడం గమనార్హం.

Updated Date - May 13 , 2024 | 05:31 AM