Revenue Department: ఎవరేమనుకుంటే మాకేంటి
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:28 AM
రెవెన్యూశాఖ ఇంకా కట్టడి కాకపోవడంతో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అధికారికి సీసీఎల్ఏ కార్యాలయంలో కీలక పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదమైంది

ఏసీబీ కేసు ఉన్న అధికారికే విజిలెన్స్
సీసీఎల్ఏలో తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల
సర్వీసు, విజిలెన్స్ కేసుల పరిష్కార బాధ్యతలు
పోలవరం ప్రత్యేక అధికారిగా ఉండగా 2017లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు
ప్రాసిక్యూషన్కు అనుమతి కోరిన ఏసీబీ
ఏమీ తేల్చకుండా నాన్చిన గత ప్రభుత్వం
ఆ అధికారి విచారణకు ఇటీవలే అనుమతి
ఇంతలోనే అదే అధికారికి కీలక పోస్టింగ్
రెవెన్యూ శాఖలో సరికొత్త వివాదం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘‘రెవెన్యూశాఖ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. ఇలాగైతే కష్టం’’ సీఎం చంద్రబాబు ఇటీవలి కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. ఈ శాఖను దారి లో పెట్టి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని సీఎం తపనపడుతుంటే, రెవెన్యూ అధికారులు మాత్రం తమదారి తమదే అని నిరూపించుకున్నా రు. ఏసీబీ కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాలని ఓ అధికారిపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే, ఆ అధికారికే ఏరికోరి సీసీఎల్ఏ(భూపరిపాలన ప్రధాన కమిషనర్) కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు విస్తుపోతున్నా రు. భారీగా డబ్బు దొరికిన కేసులో ఏసీబీ విచారణ ను ఎదుర్కోవాల్సిన అధికారికి విజిలెన్స్ విభాగం ఎలా ఇచ్చారు? అన్న చర్చతో ఈ వ్యవహారం వివాదస్పదంగా మారింది. ఏసీబీ కేసులు ఉన్నవారికి భరోసా ఇచ్చేలా పోస్టింగ్ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లక్షమందికిపైగా ఆదివాసీలు నిర్వాసితులవుతున్నా రు. వారికి పునరావాసం, పరిహారాలను అందించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసింది. ఇందులో ఓ డిప్యూటీ కలెక్టర్ స్థా యి అధికారిని ప్రత్యేకంగా నియమించారు. 2017లో పోలవరం ఎస్డీసీ కార్యాలయంలో భారీగా నగ దు పంపిణీ జరుగుతోందన్న ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు దాడిచేశారు. ఆ సమయంలో సోదాలు జరప గా ఓ డిప్యూటీ కలెక్టర్ స్థాయి కీలక అధికారి వద్ద భారీగా నగదు లభ్యమైంది. దీంతో ఏసీబీ అధికారు లు కేసు నమోదు చేశారు. జవాబుదారీ కాని సొ మ్ము దొరికిందని కేసు డైరీలో పేర్కొన్నారు.
ఈ కేసు పై విచారణలో భాగంగా ఆ అధికారిపై నమోదైన ఆరోపణలపై కోర్టులో విచారించేందుకు(లీగల్ ప్రాసిక్యూషన్) అనుమతించాలని ఏసీబీ కోరింది. గత ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా విషయాన్ని నాన్చ గా, కొత్త ప్రభుత్వం ఇటీవలే ఇందుకు అనుమతించింది. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆ అధికారికి సీసీఎల్ఏలో పోస్టింగ్ ఇచ్చారు. అదీ చాలా కీలకమైన పోస్టింగ్. సీసీఎల్ఏ కార్యాలయంలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐ, ఇతర ఉద్యోగుల విజిలెన్స్ కేసులు, సర్వీసు అంశాలు చూసే విభాగం ఆ అధికారికి అప్పగించారు. ఆ అధికారి గురించి గతం లో పనిచేసిన జిల్లా కలెక్టర్, జేసీతో మాట్లాడిన తర్వాతే ఈ పోస్టింగ్ ఇచ్చినట్లు రెవెన్యూశాఖ సమర్థించుకుంటోంది. కానీ, ఆయనకు ఏరికోరి విజిలెన్స్ విభాగం ఎందుకు ఇచ్చారన్న దానికి సమాధానం లేదు. ఏసీబీ కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కొనే అధికారి, తన కింది కేడర్ అయిన తహసీల్దార్, డీటీల విజిలెన్స్ కేసుల్లో పారదర్శకంగా ఎలా ఉంటారు? ఈ విషయం గురించి ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా, ఓ ఉన్నతాధికారి కావాలనే పోస్టింగ్ ఇప్పించారనే విషయం వెలుగుచూసింది.
Read Latest AP News And Telugu News