Andhra Pradesh: రాజ్యసభ స్థానానికి సీఈసీ నోటిఫికేషన్.. షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Apr 16 , 2025 | 09:09 AM
ఏపీలో రాజ్యసభ స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఎంపీగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..

ఏపీలో రాజ్యసభ స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీ భర్తీకి సీఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.
షెడ్యూల్ ఇదే..
ఈ నెల 22 నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన
మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక, ఫలితాలు
కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడంతో పలువురు కీలక నేతలు తమ పదవులకే కాకుండా.. పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామానే చేస్తున్నానని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానంటూ ఆయన వెల్లడించారు.
2019 పార్టీ ఎన్నికల్లో గెలుపుతోపాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసే వరకు తెరచాటు యంత్రంగా పనిచేశారు విజయసాయిరెడ్డి. అయితే, జగన్ అధికారం చేపట్టిన అనంతరం క్రమక్రమంగా విజయసాయిరెడ్డి పాత్ర కనుమరుగవుతూ వచ్చింది. ప్రాధాన్యత లేని పదవులు ఇవ్వడంతో ఆయన అశాంతికి గరయ్యారని, ఇంతలోనే ఎన్నికలు రావడం, వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో ఆయన ఎంపీ పదవీతోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే, సంఖ్యా బలం ఆధారంగా కూటమి ప్రభుత్వానికే ఎంపీ స్థానం దక్కే అవకాశం ఉంది.