CM Chandrababu Naidu: నూతన ఆవిష్కరణల
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:09 AM
ఆంధ్రప్రదేశ్ను నూతన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేయాలని యోచిస్తున్నారు.

అమరావతిని క్వాంటమ్ వ్యాలీని చేయడమే లక్ష్యం
రాష్ట్రం నుంచి కొత్త పారిశ్రామికవేత్తలు రావాలి
స్ఫూర్తి నింపేందుకే ఇన్నోవేషన్ హబ్లకు టాటా పేరు
ఇన్నోవేషన్ కేంద్రాలతో భాగస్వామ్యం అవ్వండి
ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ సంకల్పం నిజం చేయండి
ఐదేళ్లలో 20 వేల స్టార్ట్పలతో లక్ష ఉద్యోగాలు
రాష్ట్రంలో 10 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు
రతన్టాటా ఇన్నోవేషన్ హబ్గా అమరావతి
పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కండి
పారిశ్రామికవేత్తలు, మేధావులకు సీఎం పిలుపు
సచివాలయంలో ఇన్నోవేషన్ హబ్లపై భేటీ
వీసీ ద్వారా పాల్గొన్న టాటా గ్రూప్ చైర్మన్
వయో వృద్ధుల కోసం ‘పీఎంజేఏవై’
70 ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): కొత్త ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నాడు హైదరాబాద్ను ఐటీ హబ్గా చేసినట్లుగానే.. నేడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చడమే తన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను తీర్చిదిద్దేందుకు, వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలని.. నూతన ఆవిష్కరణలకు ఏపీ హబ్గా మారాలని ఆకాంక్షించారు. అందరిలోనూ స్ఫూర్తిని నింపేందుకే ఇన్నోవేషన్ హబ్లకు రతన్టాటా వంటి గొప్పవ్యక్తి పేరు పెట్టామని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో రతన్టాటా ఇన్నోవేషన్ హబ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.
నాటి సంస్కరణలతో సత్ఫలితాలు
భారతీయులు దేశ విదేశాల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, విదేశీయుల కంటే ఎక్కువగా ఆర్జిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ ఎంటర్ప్రెన్యూర్లలో 30 శాతం తెలుగు ప్రజలు ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. నిజానికి ఇప్పుడు తెలుగు ప్రజలు ఈ స్థాయికి చేరుకోవడానికి తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని అన్నారు. ఆ సంస్కరణలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. సీఐఐ సమావేశాలు నిర్వహించడం, ఇంజనీరింగ్ కాలేజీలు విస్తరించడం, మైక్రోసాఫ్ట్ సహా ఇతర ప్రముఖ కంపెనీలను రప్పించడం ద్వారా హైదరాబాద్ నగర రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. వన్ ఫ్యామిలీ -వన్ ఐటీ ప్రొఫెషనల్ అని గతంలో తాను చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయని గుర్తుచేశారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఆయా ప్రాంతాలను, అక్కడ పరిస్థితులను ఆకళింపు చేసుకుని ప్రతిభతో రాణిస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దూరం సమస్య కానేకాదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు.
పేదరికాన్ని రూపుమాపడానికే పీ4
గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన పీ3 కార్యక్రమంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈసారి పూర్తిగా పేదరికం నిర్మూలనకు పీ4 కార్యక్రమానికి పిలుపు ఇచ్చామన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారు అట్టడుగున ఉన్న పేదలకు అండగా నిలవడమే పీ4 లక్ష్యమని చెప్పారు. అంబేడ్కర్, అబ్దుల్ కలాం వంటి వారు ఇతరుల సహాయంతోనే పైకి వచ్చారని వివరించారు. సమాజంలోని అసమానతలను తొలగించి.. పేదరికాన్ని నిర్మూలించేందుకు అందరూ సహకరించాలని పారిశ్రామికవేత్తలను సీఎం కోరారు.
వచ్చే ఐదేళ్లలో 20 వేల స్టార్ట్పలు
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 20,000 స్టార్ట్పలు ఏర్పాటు అయ్యేలా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వీటితో ఒక లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 10 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు వస్తాయన్నారు. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్గా అమరావతి ఉంటుందని, గ్రూప్ లీడరుగా టాటా గ్రూప్ ఉంటుందని వివరించారు. ఎల్ అండ్ టి, ఎఎంఎ్సఎస్ పార్టనర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు. అమరావతి హబ్కు రాష్ట్రంలో ఐదు స్పోక్స్ అనుబంఽధంగా ఉంటాయని చెప్పారు. స్పోక్స్ లీడ్ పార్టనర్లుగా అనంతపురానికి జేఎ్సడబ్ల్యూ, తిరుపతికి అదానీ గ్రూప్, విజయవాడకు మేఘా ఇంజనీరింగ్, రాజమహేంద్రవరానికి గ్రీన్కో, విశాఖపట్నానికి జీఎంఆర్ స్పోక్స్ పార్టనర్లుగా వ్యవహరిస్తాయని తెలిపారు.
చంద్రబాబు ఆలోచనలు ఉన్నతమైనవి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలను పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్, జీరో పావర్టీకి పీ4 కార్యక్రమాలు ఎంతో ఉన్నతమైనవని చెప్పారు. వచ్చే ఏడాది కల్లా అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఫస్ట్ బ్యాచ్కు అడ్మిషన్లు చేపడతామని బిట్స్ పిలానీ వైస్ చాన్స్లర్ వి.రామగోపాలరావు చెప్పారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కూడా తాము భాగస్వాములం కావాలనుకుంటున్నామని వెల్లడించారు. విశాఖలో జీఎంఆర్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థల అధినేత జీఎంఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఆర్టీఐహెచ్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న టాటా గ్రూప్, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా మరికొందరు ప్రముఖులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..