ఓఎన్జీసీ టెర్మినల్ వద్ద గ్రామస్తులు, కూటమి నేతల ధర్నా
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:12 AM
35ఏళ్లుగా ఓడలరేవు నుంచి భారీస్థాయిలో చమురు, సహజవాయు నిక్షేపాలు తరలించుకుపోతున్నా ఓడలరేవు గ్రామాభివృద్ధి పట్ల ఓఎన్జీసీ అధికారుల వైఖరిని నిరసిస్తూ టెర్మినల్ ప్లాంటు గేటు వద్ద శనివారం గ్రామస్తులు, కూటమి నేతలు ధర్నా చేసి నిరసన తెలిపారు.

అల్లవరం ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): 35ఏళ్లుగా ఓడలరేవు నుంచి భారీస్థాయిలో చమురు, సహజవాయు నిక్షేపాలు తరలించుకుపోతున్నా ఓడలరేవు గ్రామాభివృద్ధి పట్ల ఓఎన్జీసీ అధికారుల వైఖరిని నిరసిస్తూ టెర్మినల్ ప్లాంటు గేటు వద్ద శనివారం గ్రామస్తులు, కూటమి నేతలు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఓఎన్జీసీ అధికారులు ఆర్డీవో కార్యాలయంలో చర్చల్లో వారం రోజులు గడువు కోరినా పట్టించుకోలేదంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఓడలరేవు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబురాజు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు, కొల్లు విష్ణుమూర్తి, నాతి లెనిన్బాబు, కొప్పాడి వెంకటరామకృష్ణారావు, గుండుమేను శ్రీను, సోమాని వెంకటరమణ, కొల్లు త్రిమూర్తులు, పెమ్మాని వెంకటరామారావు, ఏసుబాబు, జనసేన నాయకులు గుర్రం కృష్ణ, కామాడి గంగాభవానీ, నల్లా రాము, టీడీపీ నేతలు ఈసకోను సాంబశివ, బొర్రా రాజేష్ తదితరులు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఓడలరేవు గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్తుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని దెందుకూరి సత్తిబాబురాజుతో పాటు కూటమి నేతలు పేర్కొన్నారు. మార్చి27న ఆర్డీవో కార్యాలయంలో జరిగిన చర్చల్లో వారం రోజులు గడువు కోరిన ఓఎన్జీసీ అధికారులు కాలయాపన చేశారని విలేకరుల సమావేశం ఆరోపించారు. ఓఎన్జీసీ అధికారులు రెండు రోజుల్లోగా దిగి వచ్చి న్యాయం చేయకుంటే ఓఎన్జీసీ టెర్మినల్ పనులను స్తంభింపచేస్తామని గ్రామస్తులు, కూటమి నేతలు హెచ్చరించారు.