CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మరోసారి స్పందించిన సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:12 PM
వైసీపీ నేతలంతా ఒకదాని వెంట మరొకటిగా సమస్యలను తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. ఇలాంటి విషయాల్లో కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల, తిరుమల గోశాల, వక్ఫ్ బిల్లు వంటి అంశాలపై వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలంతా ఒకదాని వెంట మరొకటిగా సమస్యలను తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కూటమి నేతలంతా అప్రమత్తంగా ఉండాలని, పాస్టర్ ప్రవీణ్ విషయంలో అన్ని సాక్ష్యాలు చూపించినా ఇంకా బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో అశాంతి రేపి అల్లర్లు సృష్టించాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు క్లియర్గా చెప్పి చేద్దాం. వక్ఫ్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో మనం క్లియర్గా ఉన్నాం. వక్ఫ్ బిల్లుపై వైసీపీ మూడు రకాలుగా వ్యవహరించింది. ఆ పార్టీ ఎంపీలు లోక్ సభలో వ్యతిరేకిస్తూ రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారు. మరోవైపు బయటకు వచ్చి మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. వైసీపీ వైఖరి ఎలా ఉందనేది అందరికీ అర్థం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నేతలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాజధాని అమరావతిలో అన్ని పనులకు టెండర్లు పిలిచాం. రహదారులు, రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కల్పనకూ టెండర్లు పిలిచాం. భవనాల అన్నింటికీ టెండర్లు ఖరారు చేశాం. వీటన్నింటినీ మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రూపొందించాం.
మే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఉంటుంది. అమరావతి పనులను మోదీ రీస్టార్ట్ చేస్తారు. మూడేళ్లలో అసెంబ్లీ, హైకోర్ట్, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తి అవ్వాల్సిందే. అసెంబ్లీలో అంతర్గత వసతి మొత్తం ఎలా ఉండాలనే అన్న అంశంపై మంత్రులు చర్చించాలి. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల పర్యటను వెళ్లినప్పుడు మూడు పార్టీలు నేతలను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలి. సూర్యఘర్ను పథకాన్ని ఇంకా వేగంగా అమలు చేయాలి. ప్రభుత్వ భవనాలపైనా సూర్యఘర్ ఫలకాలు అమర్చాలి. రాజకీయంగా మేమంతా ఎక్కడా తప్పు చేయడం లేదు. కానీ అధికారుల అవినీతిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీన్ని వారు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో తగిన చర్యలు ఉంటాయి. జిల్లాస్థాయిల్లో రెవెన్యూ అంశాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని తెలిసింది. అందరూ జాగ్రత్తగా పని చేయాలని" చెప్పారు.
ఎవ్వరినీ వదలం: హోంమంత్రి
తిరుపతి ఆధ్యాత్మికంగా చాలా సున్నితమైన ప్రదేశమని, కానీ అక్కడా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్వీ గోశాలలో ఆవులు మృతిచెందాయంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలోనూ పింక్ డైమండ్ అని చెప్పి ప్రభుత్వంపై బురదజల్లారని అనిత ఆగ్రహించారు. చివరికి విచారణలో అసలు పింక్ డైమండే లేదని తేలిందని చెప్పుకొచ్చారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ కొందరు పాస్టర్ల ముసుగులో మాట్లాడకూడని మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు పరీక్షలకు ఆలస్యం అయ్యారనే వార్తలో నిజం లేదని తేల్చి చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..