AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
ABN , Publish Date - Apr 15 , 2025 | 02:33 PM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

అమరావతి: వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసుపై సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు సిట్ బృందం వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, వైసీపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు, సిట్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విచారణకు హాజకావాలని హైకోర్టు చెప్పినా.. ఆదేశాలను లెక్కచేయకుండా కసిరెడ్డి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ మేరకు హైదరాబాద్లో సోమవారం నాడు ఏకకాలంలో 15 చోట్ల సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. అలాగే అతని బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లలోనూ సోదాలు చేశారు.
ఏక్తా హైట్స్, కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న అరేటి ఆస్పత్రి, అలాగే అతని అత్త ఇంట్లోనూ దాడులు నిర్వహించారు. మద్యం కుంభకోణంలో ప్రతి నెలా రూ.60 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు దాదాపు రూ.3 వేల కోట్లు వసూలు చేయడంలో కసిరెడ్డి ప్రధాన ప్రాతధారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు విచారణ హాజరుకావాలని కోరగా.. ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు అతను దేశం విడిచి పారిపోకుండా అధికారులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..
AP Government: అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం.