Big Shock To Kakani: కాకాణి బెయిల్.. నో చెప్పిన హైకోర్టు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:15 PM
Big Shock To Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురదెబ్బ తగిలింది.కాకాణికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

అమరావతి, ఏప్రిల్ 9: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డికి (Former Minister Kakani Goverdhan Reddy) ఏపీ హైకోర్టు (AP High Court) షాక్ ఇచ్చింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో గోవర్ధన్ రెడ్డికి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అలాగే కేసును కొట్టివేయాలంటూ కాకాణి వేసిన క్వాష్ పిటీషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసుతో కాకాణికి సంబంధం లేదని అందువల్ల ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలకు సంబంధించి విచారించేందుకు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాణి హాజరుకాలేదని, ఆయన, ఆయన అనుచరులు కలిసి క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు చేశారని, ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయని, ఈ తవ్వకాల వెనక కాకాణి ఉన్నారని ప్రాసిక్యూషన్ తరపున కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కాకాణి తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు అని హైకోర్టు స్పష్టం చేశారు. విచారణను కూడా హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
కాగా.. గత ప్రభుత్వ హయాంలో కాకాణి సొంత గ్రామం తోడేరుకు అతి సమీపంలోని వరదాయపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్ జరిగింది. అప్పటి మంత్రిగా ఉన్న కాకాణి కనుసన్నల్లోనే ఈ మైనింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ దాదాపు 30 ఏళ్లుగా మైనింగ్ నిర్వహిస్తున్న రుసుం మైన్స్ను బెదిరించి మరీ వారిని అక్కడి నుంచి తరిమేసి.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్వార్ట్జ్ అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నెల్లూరులో అక్రమ మైనింగ్పై ఫిబ్రవరి 16న పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా విచారణకు రావాల్సిందిగా కాకాణికి ఒకటికి మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు మాజీ మంత్రి. కానీ తాను తప్పించుకోవడం లేదని, పోలీసులకు సహకరిస్తానని ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే పోలీసుల కన్నుగప్పి పరారీలోనే ఉంటున్నారు కాకాణి. మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ డుమ్మా కొట్టారు కాకాణి. వ్యక్తిగతంగా కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ప్రతీసారి అక్కడ ఆయన లేకపోవడంతో బంధువులకు ఇచ్చారు పోలీసులు. అంతే కాకుండా పోలీసులను కూడా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కాకాణి కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన షాక్తో కాకాణి.. పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది.
ఇవి కూడా చదవండి
Trump China Tariffs: చైనాపై ట్రంప్ బాదుడు 104 శాతానికి!
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో కీలక పరిణామం..
Read Latest AP News And Telugu News