National Cancer Grid: ఏపీలో నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ సెంటర్
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:28 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏపీ చాప్టర్ను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్తో క్యాన్సర్ రోగుల చికిత్సను మెరుగుపరిచేందుకు కర్నూలు, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రులను అనుసంధానించారు

నోడల్ కేంద్రంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రి
విశాఖ, కర్నూలు, కాకినాడ ఆస్పత్రుల అనుసంధానం
ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో రోగులకు మెరుగైన చికిత్సలు
గుంటూరు మెడికల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య బోధన ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన, కచ్చితత్వంతో కూడిన వైద్యం అందించేందుకు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏపీ చాప్టర్ను ఏర్పాటు చేశారు. టాటా మోమెరియల్ సెంటర్, హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ (విశాఖపట్నం), నవ్య కేర్ నెట్వర్క్లతో కలసి నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాఫ్ట్వేర్తో పనిచేసే ఎన్సీజీకి... పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్తో పాటు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు ప్రభుత్వాస్పత్రులను అనుసంధానం చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి ఆంకాలజీ విభాగాన్ని నోడల్ సెంటర్గా ఎంపిక చేశారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం ఈ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ఆయన నాలుగు ఆస్పత్రులకు చెందిన సూపరింటెండెంట్లు, ఆంకాలజీ వైద్య నిపుణులను ఉద్దేశించి మాట్లాడారు.
క్యాన్సర్ రోగుల డేటాను సేకరించి, వాటిని ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించి చికిత్స అనంతరం రోగుల పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. దీనివల్ల క్యాన్సర్ చికిత్సల్లో మానవ తప్పిదాలను కనిష్ట స్ధాయికి తగ్గించే వెసులుబాటు ఉంటుందన్నారు. కార్యక్రమంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వితో పాటు క్యాన్సర్ వైద్యనిపుణులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News