ఆశాలకు వేతనాలు పెంచాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:20 AM
ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అరసవల్లి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలైన సందర్భంగా ఆశా వర్కర్లు సాధించిన విజయాలు - సవాళ్లు అనే అంశంపై స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశాలను రెగ్యులరైజ్ చెయ్యాలని, చట్టబ్దమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని, కార్మికులుగా గుర్తించాలని, ఒప్పంద జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ ఇన్స్యూరెన్స్ కల్పించాలని కోరారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు జీతాలు పెంచకపోవడం విచారకరమన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి కార్మికుంలంతా ఐక్య పోరాటాలు చేయాలన్నారు. 44 లేబర్ కోడ్లను కేవలం నాలుగు కోడ్లుగా తీసుకురావడం, కార్మికుల మెడకు ఉరితాడు అని అన్నారు. ఈ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వచ్చే నెల 20న జరిగే సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.నాగమణి, ప్రధాన కార్యదర్శి అమరావతి, నాయకులు జయలక్ష్మి, లావణ్య, సుజాత, పార్వతి, సుధ, స్వర్ణలతా పట్నాయక్, అన్నపూర్ణ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.