ACP AppalaRaju: గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడి..
ABN , Publish Date - Apr 14 , 2025 | 10:11 PM
జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకున్నారని, 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉద్యోగం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

విశాఖ: పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గర్భిణీ అనూషను భర్త గొంతు నులిమి హత్య చేసిన ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకున్నారని, 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారని ఆయన తెలిపారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు అప్పలరాజు. అయితే అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని, ఈ క్రమంలోనే పలు నాటకాలు ఆడినట్లు తెలిపారు.
తొలుత తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఆమె అంగీకరించకపోవడంతో మరికొన్నాళ్లకు మరో నాటకం ఆడాడని చెప్పారు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడని తెలిపారు. అందుకే విడాకులు తీసుకుందామని మరోసారి ఒత్తిడి చేసినట్లు వెల్లడించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను జ్ఞానేశ్వర్ గొంతు నులిమి హత్య చేసినట్లు ఏసీపీ అప్పలరాజు వెల్లడించారు.
మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడని అప్పలరాజు తెలిపారు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదని, అయితే వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడని తెలిపారు. జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్నామని, తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ వెల్లడించారు. నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ అప్పులరాజు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..