Share News

2,086 గ్రామాల్లో మలేరియా మందు స్ర్పేయింగ్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:13 PM

జిల్లాలో మలేరియా నియంత్రణలో భాగంగా దోమల నివారణకు అవసరమైన మందు పిచికారీ పనులను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌ 15న దోమల నివారణ మందు స్ర్పేయింగ్‌ తొలి విడత పనులను ప్రారంభిస్తారు.

2,086 గ్రామాల్లో మలేరియా మందు స్ర్పేయింగ్‌
ఓ గిరిజన పల్లెలో స్ర్పేయింగ్‌ చేస్తున్న దృశ్యం(ఫైల్‌)

నేటి నుంచి దోమల నివారణ మందు పిచికారీ ప్రారంభం

గ్రామ స్థాయి ఉద్యోగులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటు

పాడేరు, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా నియంత్రణలో భాగంగా దోమల నివారణకు అవసరమైన మందు పిచికారీ పనులను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌ 15న దోమల నివారణ మందు స్ర్పేయింగ్‌ తొలి విడత పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలోని 22 మండలాల్లో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 311 గ్రామ సచివాలయాల్లోని 2,086 గ్రామాలను స్ర్పేయింగ్‌కు ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో గతంలో మలేరియా కేసులు అధికంగా నమోదు కావడమే ఎంపికకు గల కారణం. దీంతో మలేరియా దోమల నివారణకు అవసరమైన మందు స్ర్పేయింగ్‌ తొలి విడత పనులను ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో చేపతారు. అలాగే జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు రెండో విడత అదే గ్రామాల్లో స్ర్పేయింగ్‌ చేస్తారు. దీంతో ఆయా గ్రామాల్లో మలేరియా దోమల నివారణ జరుగుతుందని అధికారులు అంటున్నారు. స్ర్పేయింగ్‌ పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు పంచాయతీ స్థాయిలో ఉండే ఉద్యోగులతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మలేరియా విభాగంతో పాటు, వైద్యారోగ్య, పంచాయతీ, రెవెన్యూ శాఖ ఉద్యోగులు భాగస్వాములవుతారు.

Updated Date - Apr 14 , 2025 | 11:13 PM