Delhi New CM: ఢిల్లీ సీఎం అతడే..అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:09 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ మార్క్ను చేరుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఇప్పుడు చర్చంతా ఢిల్లీ తరువాత సీఎం ఎవరు.. బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుంది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 36 స్థానాల మెజార్టీ మార్క్ను దక్కించుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. 1993లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడు దశాబ్ధాల తర్వాత మరోసారి ఢిల్లీ శాసనసభలో అధికారాన్ని దక్కించుకోబోతుంది. 2014లో కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీలో అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ పనిచేసింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసారి ఢిల్లీ ఎన్నికలను తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ ప్రధాని మోదీ ఢిల్లీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టలేదు. ఈసారి మాత్రం తన పంతం నెగ్గించుకోవాలనే పట్టదలతో తీవ్రంగా శ్రమించారు. చివరకు ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనుంది. దేశ వ్యాప్తంగా బీజేపీ సంచలన విజయాలు నమోదుచేస్తున్నప్పటికీ.. ఢిల్లీలో నాయకత్వలేమి ఆ పార్టీని ఎప్పటినుంచో వెంటాడుతోంది. 1993లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులను మార్చింది. ఈక్రమంలో ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే చర్చ జోరుగా సాగుతున్నవేళ.. బీజేపీ అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో తెలుసుకుందాం.
అతడేనా..
ఢిల్లీలో అధికారంలోకి రావడమే కాదు.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్నుత ఎన్నికల్లో ఓడించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీచేసిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ను పోటీకి నిలిపింది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటికీ పర్వేష్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా జాట్ సామాజికవర్గానికి చెందిన ఆయనను సీఎం చేస్తారనే ప్రచారం ద్వారా ఆ సామాజికవర్గం ఓట్లను బీజేపీ ఎక్కువుగా ఆకర్షించింది. మరోవైపు ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే కేజ్రీవాల్పై ఆయన అధిక్యాన్ని కనబరుస్తున్నారు. దీంతో పర్వేష్ గెలిస్తే మాత్రం ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. 1996 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 1998 అక్టోబర్ 12 వరకు పర్వేజ్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం పర్వేష్ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here