Fake Doctor: 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్
ABN , Publish Date - Apr 09 , 2025 | 02:35 AM
బ్రిటన్ సర్జన్గా చలామణి అయిన నకిలీ డాక్టర్ నరేంద్ర యాదవ్ దాదాపు రెండు దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా డజన్ల ఫేక్ డిగ్రీలతో ఆపరేషన్లు చేస్తూ ఏడుగురి ప్రాణాలు తీసాడు. తాజాగా మధ్యప్రదేశ్లో పట్టుబడిన ఇతను ‘డెత్ డాక్టర్’గా గుర్తింపు పొందాడు.

బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి
మధ్యప్రదేశ్లో ఓ ఆస్పత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు.. వారిలో ఏడుగురి మృతి
పరారీలో నకిలీ వైద్యుడు.. తాజాగా అరెస్టు
15 వేల ఆపరేషన్లు చేసినట్టు ప్రచారం
2006లో ఛత్తీ్సగఢ్ స్పీకర్కు కూడా..
ఆపరేషన్ అనంతరం స్పీకర్ మృతి
దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు
ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్
దమో్హ(మధ్యప్రదేశ్), ఏప్రిల్ 8: దొంగ డిగ్రీలతో, బ్రిటన్ జాతీయుడైన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఎన్ జాన్ కామ్గా చలామణి అవుతున్న మోసగాడు మధ్యప్రదేశ్లోని ఒక మిషన్ ఆసుపత్రిలో ఏకంగా 15 గుండె ఆపరేషన్లు చేసి ఏడుగురి చావుకు కారణమయ్యాడు. అతని తీరుపై అనుమానం వచ్చిన ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పరారయ్యాడు. చివరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో తనను పట్టుకున్నారు. తెల్లకోటు మోజుకు డజన్ల కొద్దీ పేషంట్ల ప్రాణాలు తీసిన ఇతన్ని పోలీసులు డెత్ డాక్టర్గా పిలుస్తున్నారు. జుట్టుకు బంగారు రంగు వేసుకుని శ్వేతజాతీయుడిలా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకొనే ఇతను 2006లో ఏకంగా ఛత్తీ్సగఢ్ స్పీకర్కు బిలా్సపూర్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసి అతని చావుకు కారణమయ్యాడని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. అంటే దాదాపు రెండు దశాబాలుగా డెత్ డాక్టర్ ఆపరేషన్లు చేస్తున్నాడన్న మాట. ఇతని అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని పోలీసులు చెబుతున్నారు. స్వస్థలం డెహ్రాడూన్. డజన్ల కొద్దీ ఫేక్ డిగ్రీలు సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఆసుపత్రి ప్రొఫైల్ను బట్టి సూట్ అయ్యే డిగ్రీలు బయటకు తీస్తాడు. అతని దగ్గర ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా ఉంది. కార్డియాలజీకి సంబంధించి అతని దగ్గర అనేక స్పెషల్ పట్టాలు ఉన్నాయి. దేశ, విదేశాల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో పని చేసినట్లు క్రెడెన్షియల్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని దమో్హలో ఉన్న మిషనరీ ఆసుపత్రి కార్డియాక్ సర్జన్ను నియమించుకోవాలని అనుకుంది. ప్లేస్మెంట్ ఏజెన్సీని సంప్రదించింది. తాను బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ను అని, మానవ సేవలో భాగంగా భారతదేశంలో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నానని చెప్పడంతో ఆసుపత్రి యాజమాన్యం బుట్టలో పడిపోయింది.
అతని భాష, వంటి రంగు, బంగారు రంగు జుట్టు చూసి బ్రిటన్ జాతీయుడేనని అనుకున్నారు. నెలకు రూ.8 లక్షల జీతంతో ఆయన్ను నియమించుకున్నారు. ఎన్.జాన్ కామ్ అలియాస్ నరేంద్ర ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆసుపత్రిలో పని చేశాడు. తన చేతుల మీదుగా 15 ఆపరేషన్లు చేస్తే అందులో ఏడుగురు మరణించారు. పేషంట్ల బంధువులు వచ్చి ఫిర్యాదు చేయడంతో జిల్లా వైద్యాధికారి దర్యాప్తు చేశారు. డాక్టర్ కామ్ సరైన డిగ్రీలు లేకుండా యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ చేసినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే దొంగ డాక్టర్ రాజీనామా చేసి పరారయ్యాడు. చివరకు ప్రయాగరాజ్లో పట్టుకున్నారు. అతను జీవిత కాలంలో 15 వేల ఆపరేషన్లు చేసినట్లుగా ప్రొఫైల్లో చెప్పుకున్నాడు. 2006లో అప్పటి అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ శుక్లాకు గుండెనొప్పి వచ్చినపుడు బిలా్సపూర్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్యుడు ఆపరేషన్ చేస్తాడని అప్పట్లో ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. ఆపరేషన్ తర్వాత స్పీకర్ చనిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News