Waqf Law: నేను ఇక్కడుండగా అది అమలు కాదు: మమత
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:32 PM
అందరూ కలిసికట్టుగా ఉద్యమం ప్రారంభిద్దామని కొందరు రెచ్చగొట్టవచ్చని, అయితే ఆ పని చేయవద్దని మమతా బెనర్జీ కోరారు. మైనారిటీలు, వారి ఆస్తులకు తాము కాపాడతామని అన్నారు.

కోల్కతా: వక్ఫ్ సవరణ చట్టం (Waqf Amendment Act) అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ప్రకటన చేశారు. పశ్చిమబెంగాల్లో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. కోల్కతాలో జైన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, మైనారిటీ ప్రజలు, వారి ఆస్తులను తాను పరిరక్షిస్తానని చెప్పారు.
Rafale Fighter Jets: 26 రఫేల్ మెరైన్ ఫెటర్ల కొనుగోలుకు భారత్ డీల్
''వక్ఫ్ చట్టం అమలుకు సంబంధించి వీరంతా ఆవేదనతో ఉన్నారని నాకు తెలుసు. విభజించి పాలించాలనుకుంటే బెంగాల్లో కుదరదు. నాపై విశ్వాసం ఉంచండి. మీరంతా కలిసికట్టుగా ఉంటామని బలమైన సందేశం ఇవ్వండి'' అని మమతా బెనర్జీ అన్నారు. రాజకీయ ఉద్యమం ప్రారంభించాలంటూ రెచ్చగొట్టే వాళ్లను పట్టించుకోవద్దని సూచించారు.
ముర్షీదాబాద్ హింసాకాండపై..
వక్ఫ్ బిల్లుపై ముర్షీదాబాద్ జిల్లాలో హింస చెలరేగడాన్ని ప్రస్తావిస్తూ... "బంగ్లాదేశ్లో పరిస్థితిని చూడండి. ఈ సమయంలో బిల్లు ఆమోదించి ఉండకూడదు. బెంగాల్లో 33 శాతం మైనారిటీలు ఉన్నారు. వారి విషయంలో నేను ఏం చేయాలి?'' అని ప్రశ్నించారు. బెంగాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండియా అన్నీ కలిసి ఉండేవని చరిత్ర చెబుతోందని, ఆ తర్వాత విభజన చోటుచేసుకుందని, ఇక్కడ నివసించాలని ఎవరైతే అనుకున్నారో వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా, బలంగా నిలబడితే ఏదైనా సాధ్యమేనని అన్నారు.
రెచ్చిపోవద్దు..
అందరూ కలిసికట్టుగా ఉద్యమం ప్రారంభిద్దామని కొందరు రెచ్చగొట్టవచ్చని, అయితే ఆ పని చేయవద్దని మమతా బెనర్జీ కోరారు. ''దీదీ ఇక్కడ ఉండగా, ఆమె మిమ్మల్ని, మీ ఆస్తులను కాపాడుతుంది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంటాలి'' అని అన్నారు. మతసామరస్యాన్ని పాదుకొలుపేందుకు తాను కట్టుబడి ఉన్నానని, తాను అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు వెళ్తానని, వెళ్తూనే ఉంటానని చెప్పారు. తనను చంపినా సరే, అంతా ఐక్యంగా ఉండాలనే తన విధానం నుంచి వెనక్కి మళ్లేది లేదని అన్నారు.
ఇవి కూడా చదవండి..