Share News

NCTE: మళ్లీ ఒక ఏడాది బీఈడీ, ఎంఈడీ!

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:50 AM

ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు ప్రోగ్రామ్‌ల కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. దీంతో ఈ కోర్సుల కాల వ్యవధిని రెండేళ్లకు పొడిగించిన దశాబ్దం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోనుంది.

NCTE: మళ్లీ ఒక ఏడాది బీఈడీ, ఎంఈడీ!
Bed, Med

2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు.. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత ఎన్టీఏకు

జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బీఈడీ, ఎంఈడీ కోర్సులు తిరిగి ‘ఒక ఏడాది’ ఫార్మాట్‌కు తీసుకెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) యోచిస్తోంది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు ప్రోగ్రామ్‌ల కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. దీంతో ఈ కోర్సుల కాల వ్యవధిని రెండేళ్లకు పొడిగించిన దశాబ్దం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోనుంది. ఎన్‌సీటీఈ వెబ్‌సైట్‌లో ఉంచిన ముసాయిదా పాలసీపై మార్చి 8 వరకు ప్రజల అభిప్రాయాలు తీసుకోనుంది. పాలసీ ఆమోదం తర్వాత.. స్వతంత్ర ఉపాధ్యాయ విద్యా సంస్థలు (టీఈఐ) కొత్త ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉంటే, రెండేళ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సులను అందించడం కొనసాగించవచ్చు.


లేదా ఒక ఏడాది ఫార్మాట్‌లో మారేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. అన్ని బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రామాణిక సబ్జెక్ట్‌, ఆప్టిట్యూట్‌ పరీక్ష నిర్వహించనుందని హిందుస్థాన్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఎన్టీఏ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ల (ఐటీఈపీ) అడ్మిషన్ల కోసం జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్‌సీఈటీ) నిర్వహిస్తోంది. ఎన్టీఏ నిర్వహించనున్న కొత్త ఐటీఈపీ కోర్సుల పరీక్షకు సంబంధించిన విధివిధానాలు వచ్చే ఏడాది రూపొందించబడతాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్‌పర్సన్‌ పంకజ్‌ అరోరా పేర్కొన్నారు.


2026-27 విద్యా సంవత్సరం నుంచి ఐటీఈపీ యోగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సంస్కృత విద్య, కళా విద్య అనే 4 ప్రత్యేక కోర్సులను తీసుకురానున్నట్లు ఎన్‌సీటీఈ తన ముసాయిదా నిబంధనలు-2025లో పేర్కొంది. కొత్త కోర్సులతో పాటు కనీస అవసరమైన సదుపాయాలు, అధ్యాపకులు వంటి అంశాలను కూడా ఎన్‌సీటీఈ నిర్దేశించింది. ముసాయిదా నిబంధనల ప్రకారం.. కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా ప్రత్యేక సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) కలిగిన అభ్యర్థి ఒక సంవత్సర బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు రెండేళ్ల ఎంఈడీ ప్రోగ్రామ్‌ అందించబడుతుందని ముసాయిదా పేర్కొంది. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు కొత్త నిబంధనలు రూపొందించినట్లు అరోరా తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2025 | 10:24 AM