PM Narendra Modi: జల సంరక్షణకు కదలండి

ABN, Publish Date - Mar 31 , 2025 | 04:00 AM

ప్రధాని మోదీ వేసవి ప్రారంభంలో జల సంరక్షణకు ప్రజలను పిలుపునిచ్చారు. నీటిని పొదుపు చేయడానికి గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చేపట్టిన కార్యక్రమాల ద్వారా 11 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటి సంరక్షణ చేసినట్టు తెలిపారు

PM Narendra Modi: జల సంరక్షణకు కదలండి
  • దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జల సంరక్షణకు నడుంబిగించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం సహా పలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన కార్యక్రమాల ద్వారా 11 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని పొదుపు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ప్రతి నెలా చివరి ఆదివారం ‘మన్‌కీ బాత్‌’ శీర్షికన దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో చేసే ప్రసంగంలో ప్రధాని పేర్కొన్నారు. పండుగలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తాయని మోదీ అన్నారు. ‘‘ఈ ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రజలు ఉగాదిని జరుపుకొంటున్నారు. మహారాష్ట్రలో గుడిపడ్వా పేరుతో పర్వదినాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇవన్నీ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. రాబోయే రోజుల్లో అసోం, పశ్చిమ బెంగాల్‌, కశ్మీర్‌లలో వేర్వేరు పండుగలు జరగనున్నాయి. అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని కొనసాగించాలి’’ అని ప్రజలను కోరారు. త్వరలోనే వేసవి సెలవులు రానున్నాయని, విద్యార్థులు తమలోని నైపుణ్యాలకు మెరుగు పెట్టేందుకు ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు. సెలవు దినాల్లో విద్యార్థుల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు ‘మైహాలీడేస్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ను వినియోగించాలని సూచించారు. కాగా, వస్త్ర వ్యర్థాలతో ప్రపంచం పెను సవాలు ఎదుర్కొంటోందని మోదీ చెప్పారు. ఇదొక చిత్రమైన సమస్య అని.. కానీ, ప్రపంచ దేశాలన్నీ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. వస్త్ర వ్యర్థాల సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో ఉందని తెలిపారు. పాత దుస్తుల రీసైక్లింగ్‌కు స్టార్ట్‌పలు రావడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు.


ఆదిలాబాద్‌ మహిళలకు మోదీ అభినందనలు

వివిధ రకాల పువ్వుల గురించి ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. అయితే.. విప్పపూల గురించి పెద్దగా ప్రాచుర్యం లేదన్నారు. కానీ, ఈ ఇప్పపూలు గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబిస్తాయని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన గిరిజనులు ఇప్ప పూలతో సరికొత్త ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారని మోదీ ప్రస్తావించారు. ‘‘తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు సోదరీమణులు ఇప్ప పువ్వులతో కొత్త ప్రయోగం చేస్తున్నారు. వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. వాటిని ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు’’ అని తెలుపుతు ప్రధాని వారిని అభినందించారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: రూ.33,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

Amit Shah: జంగిల్‌రాజ్ కావాలో డవలప్‌మెంట్ అవసరమో తేల్చుకోండి... షా పిలుపు

Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్

Yatnal: కాంగ్రెస్‌, జేడీఎస్‏లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా

For National News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 04:00 AM