Tamil Nadu: 1971 జనాభా లెక్కలు ఆధారంగా డీలిమిటేషన్.. ప్రధానికి తమిళనాడు అఖిలపక్షం వినతి
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:43 PM
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వల్ల భారతదేశ సమాఖ్య వ్యవస్థకు, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ఈ చర్యను అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తోందని ఆ తీర్మానం పేర్కొంది.

చెన్నై: నియోజక వర్గాల పునర్విభజనను 1971 జనాభా లెక్కల ప్రకారం 2026 నుంచి వచ్చే 30 ఏళ్లు వర్తించేలా చేపట్టాలని, ఈ మేరకు పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అఖిల పక్ష సమావేశం (Tamil Nadu All-party meeting) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అధ్యక్షతన ఈ అఖిల పక్ష సమావేశం బుధవారంనాడు జరిగింది. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ అఖిల పక్ష సమావేశానికి 64 పార్టీలను ఆహ్వానించగా, 58 పార్టీలు (ఆర్గనైజేషన్లతో సహా) హాజరయ్యాయి. బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, పుదియ తమిళగం, పుదియ నీది కట్చి, నామ్ తమిళర్ కట్చి పార్టీలు సమావేశానికి గైర్హాజరయ్యాయి.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వల్ల భారతదేశ సమాఖ్య వ్యవస్థకు, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ఈ చర్యను అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తోందని ఆ తీర్మానం పేర్కొంది. దేశ సంక్షేమం దృష్ట్యా కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేలా అప్పటి ప్రధాని 2000లో ఒక హామీ ఇచ్చారని, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విజన విభజన 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంటుందనే హామీ ఇచ్చారని, ఇదే తరహా డ్రాప్ట్ను 2026 నుంచి రాబోయే 30 ఏళ్ల వరకూ వర్తించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హామీ ఇవ్వాలని ఆ తీర్మానం కోరింది. ''పార్లమెంటులో ఎంపీల ప్రాతినిధ్యం పెంచాలనుకుంటే 1971 జనాభాలెక్కల ఆధారంగా అన్ని దక్షిణాది రాష్ట్రాలకు వర్తించేలా రాజ్యాంగంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వా్నికి అఖిలపక్షం విజ్ఞప్తి చేస్తోంది'' అని ఆ తీర్మానం పేర్కొంది.
డీలిమిటేషన్కు తమిళనాడు వ్యతిరేకం కాదని, అయితే డీలిమిటేషన్ ప్రక్రియ గత 50 ఏళ్లుగా సాంఘిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రానికి శిక్ష కాకూడదని తీర్మానం పేర్కొంది. డీలిమిటేషన్ ప్రక్రియపై తమ డిమాండ్లు, నిరసనలు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమిళనాడు ఎంపీలు, దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆయా పార్టీలను లాంఛనంగా ఆహ్వానించాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించినట్టు అ తీర్మానం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
Aurangzeb Row: అబూ అజ్మీని యూపీ పంపండి.. గట్టి ట్రీట్మెంట్ ఇస్తాం: యోగి
Arvind Kejriwal: ట్రంప్ను మించిన సెక్యూరిటీతో ధ్యాన కేంద్రానికి కేజ్రీవాల్
Former Minister: హీరో విజయ్ది పగటికలే.. అందరూ ఎంజీఆర్ కాలేరు
Hero Vishal: హీరో విశాల్ ప్రశ్న.. విజయ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.