NRI: టాంటెక్స్ సాహిత్య వేదికగా ‘సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా’

ABN, Publish Date - Jan 21 , 2025 | 07:19 PM

NRI, TANTEX : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదికగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 210వ సాహిత్య సదస్సు జనవరి 19వ తేదీన డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. ''సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా'' అంశంపై వక్తలు మాట్లాడారు.

NRI: టాంటెక్స్ సాహిత్య వేదికగా ‘సాహిత్య అద్భుత వర్ణనలు - వర్ణించ తరమా’

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదికగా 'నెల నెలా తెలుగు వెన్నెల' 210వ సాహిత్య సదస్సు ''సాహిత్య అద్భుత వర్ణనలు -వర్ణించ తరమా'' అంశంపై జనవరి 19వ తేదీన డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ త్యాగరాజ కృతి ''బంటు రీతి కొలువు ఇయ్యవయ్యా రామ'' ప్రార్ధన గేయాన్ని లెనిన్ వేముల రాగయుక్తంగా ఆలపించడంతో ఈ సదస్సు ప్రారంభమైంది. అనంతరం..ఈ సదస్సు సమన్వయకర్త దయాకర్ మాడా టాంటెక్స్ 200వ సదస్సును శ్లాఘిస్తూ ప్రముఖ సినీ కవి కీ శే వడ్డేపల్లి కృష్ణ రచించిన గీతాన్ని వినిపించారు.

స్వాగతోపన్యాసం చేసి పాలక మండలి ఉపాధ్యక్షుడు, సాహిత్య వేదిక సమన్వయ కర్త దయాకర్ మాడా మాట్లాడుతూ.. గత 18 ఏళ్లుగా ఈ సాహిత్య వేదిక క్రమం తప్పకుండా ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రసిద్దులు ఈ వేదికను అలంకరిచారని గుర్తు చేసుకొన్నారు. ఆ క్రమంలో ఈ మాసం ముఖ్య అతిథిని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు.

తెలుగు ఉపన్యాసకుడిగా ఎంతో మంది విద్యార్థులకు మొక్కవోని సేవలందించిన డాక్టర్ కొచ్చర్లకోట చలపతిరావు ప్రాచీన పద్య సాహిత్యం, ఆయా కవుల అద్భుత వర్ణన విధానం గురించి అనర్గళంగా ఉపన్యసించారు. సంస్కృతాంధ్రములలో పూర్తి పట్టు సాధించిన చలపతిరావు తెలుగు సాహిత్యంలో వృద్ధి చెందిన పద్య రీతుల్లోని సంబంధాలు సొదాహరణగా వివరించారు. కంద పద్యాలు, సీస పద్యాల రూపకల్పనా.. మెళుకువలనూ అతి సరళంగా వివరించారు.


శబ్ద శాసనుడు ఆదికవి నన్నయ, ఉభయ కవి మిత్ర బిరుదాంకితుడు తిక్కన, సూక్తి వైచిత్రి గుణ సంపన్నుడు ఎఱ్ఱన తెనిగించిన మహాభారతములోని కొన్ని పద్యాలను తగిన రీతిన పాడి వినిపించి సాహితీ ప్రియులను ఎంతగానో అలరించారు. సహజ పండిత బిరుదాంకితుడైన పోతన, ప్రౌఢ దేవరాయల ఆస్థాన పండితుడు డింఢిమ భట్టు.. కంచు ఢక్కాను పగులగొట్టి కనకాభిషేకం చేయించుకున్న శ్రీనాధుడు. అలాగే "కుమార సంభవం" రాసిన నన్నెచోడుడు ''వృషాధిప'' శతక కర్త తొలి ద్విపద కవి పాల్కురికి సోమన, ''శ్రీగిరి శతకం'' వ్రాసిన మల్లికార్జున పండితారాధ్యుడు, శ్రీకృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, వేములవాడ భీమకవి, బద్దెన, ధూర్జటి, వేమన, కాసుల పురుషోత్తమ కవి, మారద వెంకయ్య, ఏనుగు లక్ష్మణ కవి,కంచెర్ల గోపన్న తదితర కవుల పద్య నిర్మాణములు తమ రచనల యందు యతి ప్రాసల వాడకంలో బహు విధ క్లిష్ట నియమములు నేర్పరచి అట్టి పద్య రచనతో అనేక మహత్తర కావ్యములను వెలువరించిన వైనాన్ని చలపతిరావు సోదాహరణంగా వివరించారు.

Also Read: అతడితో నా పెళ్లి వల్లే.. నేను మారిపోయా..


ముఖ్యంగా గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర వంటి కావ్య రచనలో కవులు వాడిన శబ్ద సౌందర్యం, శబ్దాలంకార ప్రయోగం గురించి వర్ణించే సమయంలో పద్యాలను లయ బద్ధంగా ఏకధాటిగా పాడుతున్న వీరి ధారణా శక్తికి శ్రోతలు సైతం ముగ్ధులయ్యారు.

Also Read: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ


డాక్టర్ కొచ్చర్ల కోట చలపతిరావు ప్రసంగాన్ని మెచ్చుకుంటూ చంద్రశేఖర్ పొట్టిపాటి, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్బు జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, కొండా తిరుమల రెడ్డి, జయకృష్ణ బాపూజీ, లెనిన్ వేముల, దయాకర్ మాడ, మాధవి లోకిరెడ్డి, కాశీనాధుని రాధ, రామ సీతామూర్తి, నిడిగంటి గోవర్ధనరావు వంటి సాహితీ ప్రియులు తమ స్పందనను తెలియ చేశారు. అనంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి‌తోపాటు సమన్వయ కర్త దయాకర్ మాడ.. ముఖ్య అతిథి డాక్టర్ కొచ్చర్లకోట చలపతిరావును సంస్థ తరపున సన్మాన పత్రాన్ని చదివి వినించారు.

Also Read: సీఎం మమతా బెనర్జీపై వైద్యురాలి తండ్రి సంచలన ఆరోపణలు

అలాగే ఆయనకు జ్జాపికను అందజేసి సన్మానించారు. ఇంత మంది సాహితీ ప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని చలపతిరావు పేర్కొన్నారు. ఈ డల్లాస్ మహానగరంలో టాంటెక్స్ ద్వారా ఇక్కడి తెలుగు వారు భాషా సాహిత్యానికి చేస్తున్న సేవపై తానొక శతకాని రచించి లోకానికి చాటాలని భావిస్తున్నట్లు డాక్టర్ చలపతి రావు..తన మనస్సులోని మాటలు తెలిపారు.

Also Read: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్


ఈ సమావేశం ప్రారంభంలో స్థానిక వక్తలు మాట్లాడుతూ..

శ్రీనాధుడి చాటోక్తుల విశేషాలను వర్ణిస్తూ పద్యాలను చదివి శ్రీ జయకృష్ణ బాపూజీ కవుల చమత్కారాది రస పోషణను ప్రతి పద్యంలోని భావ సౌకుమర్యాన్ని అద్భుతంగా వివరించారు. గత 80 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ''మన తెలుగు సిరి సంపదలు''శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. ఈ మాసం పద్య సౌగంధంలో శ్రీమతి కాశీనాధుని రాధ నన్నె చోడ విరచిత కుమార సంభవములోని ''విష్ణుచిత్తుని వృత్తాంత' పద్యాలను అద్భుతంగా పాడి సందర్భసహిత వ్యాఖ్య చేశారు.

Also Read: జీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం

గడచిన సంక్రాంతి సందర్భంగా సేకరించిన పిట్టలదొర చెప్పిన హాస్య కథను ప్రేరణగా పొంది 'ఇలా ఎందరు యాచకులు భుక్తి కోసం ఎన్ని జానపద కళా రూపాలను నేర్చుకొని ప్రదర్శించి రోజులు గడుపుకుంటున్నారో కదా 'అనే ఆర్ద్రచిత్తంతో ఆ పిట్టలదొర చెప్పిన కథనే సభలో ధారణ చేశారు లెనిన్ వేముల. సినీ రచయుత, దర్శకుడు జంధ్యాల జయంతి సందర్భంగా వారి స్మృతిలో వేటూరి రాసిన "అక్షర సంధ్యా వందనం" గుర్తు చేసి దానిలో తొలి భాగాన్ని చదివి దయాకర్ మాడా వినిపించారు.


సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తమ అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతోన్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సమన్వయకర్త, పాలక మండలి ఉపాధ్యక్షుడు దయాకర్ మాడ వందన సమర్పణ చేశారు. ఈ సాహిత్య కార్యక్రమాన్ని పలువురు సాహితీ ప్రియులు ప్రత్యక్షంగా మరికొందరు జూమ్ ద్వారా వీక్షించడంతో ఈ సదస్సు విజయవంతమైంది. ఈ నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలితోపాటు అధికార కార్యవర్గ సభ్యులు అభినందనీయులని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొ్న్నారు.

మరిన్ని ఎన్నారై వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 21 , 2025 | 07:24 PM