Share News

హాకీకి వందన వీడ్కోలు

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:45 AM

భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వెటరన్‌ స్ట్రయికర్‌ వందన కటారియా (32).. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. కెరీర్‌లో 320 మ్యాచ్‌లు ఆడిన...

హాకీకి వందన వీడ్కోలు

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వెటరన్‌ స్ట్రయికర్‌ వందన కటారియా (32).. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. కెరీర్‌లో 320 మ్యాచ్‌లు ఆడిన వందన 158 గోల్స్‌ సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో చరిత్ర సృష్టించిన భారత జట్టులో ఆమె కూడా సభ్యురాలు. కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉండగా గుడ్‌బై చెప్పాలనుకొన్నానని మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా కటారియా తెలిపింది. హాకీ ఇండియా లీగ్‌లో మాత్రం ఆడతానని చెప్పింది. ఉత్తరాఖండ్‌కు చెందిన వందన.. 2009లో అరంగేట్రం చేసింది. తనదైన ప్రతిభతో అనతికాలంలోనే భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా కటారియా రికార్డు సృష్టించింది. 2018 ఆసియా క్రీడల్లో రజతం.. 2013, 2018 ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టులో కటారియా సభ్యురాలు. ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డులతో ఆమెను సత్కరించింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 04:45 AM