Vontimitta: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
ABN , Publish Date - Apr 11 , 2025 | 07:24 PM
Vontimitta: ఒంటిమిట్టలో కొలువు తీరిన శ్రీసీతారామచంద్రమూర్తికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీతారాముల కల్యాణం జరిగింది. ఈ కల్యాణాన్ని సీఎం దంపతులు వీక్షించారు. రాత్రికి సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు.

కడప, ఏప్రిల్ 11: కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో కొలువు తీరిన శ్రీసీతారామచంద్రమూర్తికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలను సీఎం చంద్రబాబు దంపతులు అందజేశారు. విజయవాడ నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్ట్కు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత స్వామి వారి ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు దంపతులకు అందజేశారు.
అనంతరం సీఎం చంద్రబాబు దంపతులను వేద పండితుల ఆశీర్వదించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వామి వారి కళ్యాణం ప్రారంభమైంది. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా ఒంటిమిట్టకు చేరుకున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో.. అందుకు తగట్లుగా టీటీడీ, రాష్ట్ర దేవాదాయ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలను చేపట్టాయి. అలాగే భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇక, శుక్రవారం రాత్రికి చంద్రబాబు దంపతులు స్థానిక టీటీడీ అతిథి గృహంలో బస చేయనున్నారు. శనివారం ఉదయం 9.00 గంటలకు ఒంటిమిట్ట నుంచి నేరుగా కడప విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలతో ఆయన మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఒంటిమిట్ట రాములోరి కల్యాణ మహోత్సవం ఇక్కడ వీక్షించండి..
For AndhraPradesh News And Telugu News