Justice Chandrakumar: శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలి

ABN, Publish Date - Apr 05 , 2025 | 03:41 AM

కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, తాము శాంతి చర్చలకు సిద్ధమేనని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటించడంపై శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Justice Chandrakumar: శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలి
  • ఎన్‌కౌంటర్లు, గాలింపు నిలిపివేయాలి

  • ఇరువర్గాలు సాయుధ ఘర్షణను ఆపాలి

  • రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రతినిధులు

  • జస్టిస్‌ చంద్రకుమార్‌ అధ్యక్షతన శాంతి చర్చల కమిటీ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, తాము శాంతి చర్చలకు సిద్ధమేనని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటించడంపై శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇదో మంచి పరిణామమని, ముఖ్యంగా మధ్య భారతంలోని ఆదివాసీ, గిరిజనులకు శాంతి లభించే దిశగా అడుగు ముందుకు పడినట్లేనని అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాలు సాయుధ ఘర్షణలను ఆపాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని విన్నవించారు. కేంద్రం శాంతి చర్చల దిశగా ముందుకు రావాలని కోరారు. శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ.. శాంతి చర్చలంటే కేవలం మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంశం కాదన్నారు. ప్రభుత్వం తన అధికారాన్ని ఇష్టానుసారంగా సమాజంపై ప్రయోగించడాన్ని నిరసించడమని స్పష్టం చేశారు.


సీనియర్‌ సంపాదకుడు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజనులపై సాగుతున్న దౌర్జన్యాలను నిలువరించడం, వారి మాన, ప్రాణాలను రక్షించుకోవాలన్న దృష్టికోణంతో శాంతి చర్చలు సాగాలని సూచించారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్లను నిలిపేయాలని కోరారు. శాంతి చర్చల దిశగా ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై అభిప్రాయాన్ని తెలపాలని పేర్కొన్నారు. తన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకొని మావోయిస్టు పార్టీ శాంతి చర్చలపై సానుకూలత వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి, ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ అల్లం నారాయణ తదితరులు శాంతి చర్చల కమిటీ ప్రయత్నాన్ని స్వాగతించడంతో పాటు మద్దతు తెలిపారు. ఇరుపక్షాలతో చర్చించడానికి జస్టిస్‌ చంద్రకుమార్‌ అధ్యక్షతన శాంతి చర్చల కమిటీ ప్రతినిధులును ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:41 AM