Damodara Rajanarasimha: 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:42 AM
రాబోయే రెండు, మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయి. వర్గీకరణ చట్టం ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. మీ పిల్లలను ఉద్యోగాల పరీక్షలకు సిద్ధం చేయండి.

వర్గీకరణ చట్టం మేరకే భర్తీ.. పరీక్షలకు సిద్ధం కండి: దామోదర
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ‘‘రాబోయే రెండు, మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయి. వర్గీకరణ చట్టం ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. మీ పిల్లలను ఉద్యోగాల పరీక్షలకు సిద్ధం చేయండి. వారికి అవసరమైన గైడెన్స్, కోచింగ్ ఇప్పించేందుకు సహకారం అందించే బాధ్యత నాది. వారు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందాలి’’ అని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ.. తనను కలిసిన మాదిగ, మాదిగ ఉపకులాల సంఘ నేతలతో అన్నారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరిన సందర్భంగా వారంతా మంత్రిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ దార్శనికత, చిత్తశుద్ధి, అందరి సమిష్టి కృషితోనే వర్గీకరణ కల నెరవేరిందని ఈ సందర్భంగా దామోదర వ్యాఖ్యానించారు.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మొదటి నుంచి మద్దతు ఇచ్చిందని.. 2005లోనే వైఎ్సఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేస్తే, దాని ఆధారంగా నాటి యూపీఏ ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ను నియమించిందని ఆయన గుర్తుచేశారు. 2023లో అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు సీనియర్ న్యాయవాదిని సీఎం నియమించారని.. మేధావులు, నాయకులను పలుమార్లు ఢిల్లీకి తీసుకెళ్లి, అవసరమైన సూచనలు చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. నిరుడు ఆగస్ట్ ఒకటిన కోర్టు తీర్పు వచ్చిన అరగంటలోనే అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా సీఎంతో ప్రకటన చేయించుకున్నామని.. తర్వాత 8నెలల్లో వర్గీకరణ పూర్తయ్యేలా చర్య లు తీసుకున్నామని చెప్పారు. ఇన్నాళ్లుగా చేసిన పో రాట ఫలితాలను పొందే సమయం వచ్చిందన్నారు.