Share News

Duddilla Sridhar Babu: 2030 నాటికి 200 మిలియన్‌ చ.అడుగుల కమర్షియల్‌ స్పేస్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:29 AM

హైదరాబాద్‌ను గ్లోబల్‌ బిజినెస్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 2030 నాటికి 200 మిలియన్‌ చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులోకి వస్తుందని మంత్రి దుద్దిళ్ల తెలిపారు. జీసీసీల అభివృద్ధితో యువతకు లక్షల ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు.

 Duddilla Sridhar Babu: 2030 నాటికి 200 మిలియన్‌ చ.అడుగుల కమర్షియల్‌ స్పేస్‌

  • గ్లోబల్‌ బిజినెస్‌ హబ్‌గా హైదరాబాద్‌

  • కాగ్నిజెంట్‌ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): గ్లోబల్‌ బిజినెస్‌ హబ్‌గా హైదరాబాద్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా 2030 నాటికి రాష్ట్ర రాజధానిలో 200 మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌ ఏ కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. సిటిజన్స్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ సంయుక్తంగా నానక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ని మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్‌ గ్లోబల్‌ బిజినెస్‌ హబ్‌గా మారిందని, అందుకు అనుగుణంగానే కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరిగిందన్నారు. ఢిల్లీ, చెన్నై తదితర మెట్రో నగరాల్లో డిమాండ్‌ తగ్గుతుంటే హైదరాబాద్‌లో కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతుందని తెలిపారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా 56 శాతం వార్షిక వృద్థి రేటు నమోదైందని శ్రీధర్‌బాబు చెప్పారు. గతేడాది రిటైల్‌ రంగంలో 1.8 మిలియన్‌ చదరపు అడుగుల స్పేస్‌ను వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో అమెజాన్‌, గ్లోబల్‌ లాజిక్‌, ఎలీ లిల్లీ, మారియంట్‌, సిగ్నా తదితర అంతర్జాతీయ సంస్థలకు చెందిన 355 జీసీసీలు 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఏడాది వ్యవధిలో 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో ప్రారంభమ య్యాయని అన్నారు. హైదరాబాద్‌ను జీసీసీలకు హబ్‌గా మార్చడమే కాకుండా.. వాటిని గ్లోబల్‌ వాల్యూ యాడెడ్‌ సెంటర్లుగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. 2


030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి.. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ.. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. కాగా, సిటిజన్స్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు చేసిన జీసీసీలో ప్రస్తుతం 1000 మంది ఐటీ, డేటా నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రెండు, మూడేళ్ల వ్యవధిలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.



For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 16 , 2025 | 05:30 AM