Khammam: పోలీస్ స్టేషన్లోనే లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న ఘటన..
ABN, Publish Date - Mar 02 , 2025 | 01:35 PM
ఖమ్మం: పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పోలీస్ స్టేషన్ పైనుంచి ఓ లారీ డ్రైవర్ దూకేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఖమ్మం: పోలీస్ స్టేషన్ పైనుంచి లారీ డ్రైవర్ దూకిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం (Penuballi) వీఎం బంజర్ కాలనీ(VM Banjar Colony)లో చోటు చేసుకుంది. పెనుబల్లిలో పోలీసులు ఇవాళ(ఆదివారం) డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు వాహనాలను ఆపి వారికి టెస్టులు చేశారు. అతిగా మద్యం తాగి పట్టుపడిన వారిని కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్కు తరలిస్తున్నారు.
అయితే అదే సమయంలో డ్రైవర్ జీవన్ కుమార్ తన లారీ నడుపుకుంటూ పోలీసులు తనిఖీలు చేసే మార్గానికి వెళ్లాడు. జీవన్ పూటుగా మద్యం సేవించి ఉండడాన్ని గమనించిన పోలీసులు అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేశారు. దీంతో అతను పరిమితికి మించి మందు తాగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని వీఎం బంజర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే పోలీసులు తనపై దాడి చేసి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్టేషన్ భవనం పైకి ఎక్కి అక్కడ్నుంచి ఒక్కసారిగా దూకేశాడు. దీంతో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి.
గమినించిన పోలీసులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. వెంటనే విషయాన్ని జీవన్ కుటుంబసభ్యులు, బంధువులకు తెలియజేశారు. దీంతో వారంతా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబసభ్యులు బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, డ్రైవర్ జీవన్ కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసుల్లో ఆందోళన నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Files Missing: దుర్గగుడిలో 8 కీలక ఫైళ్ళు గల్లంతు..
Notices: డీఐజీ సునీల్ నాయక్కు నోటీసులు
Updated Date - Mar 02 , 2025 | 01:38 PM