Share News

Kishan Reddy: అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ వేధించింది

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:08 AM

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ చివరి వరకు వేధించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ ఎన్నికల్లో నిలబడితే ఆయనకు వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం నిర్వహించారని అన్నారు.

Kishan Reddy: అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ వేధించింది

  • మేం ఆయన కృషిని గౌరవిస్తున్నాం

  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

  • అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రె్‌సది

  • భీం ఆశయ సాధనకు కృషి: సంజయ్‌

బంజారాహిల్స్‌/కరీంనగర్‌/హైదరాబాద్‌/సుభా్‌షనగర్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ చివరి వరకు వేధించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ ఎన్నికల్లో నిలబడితే ఆయనకు వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం నిర్వహించారని అన్నారు. అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని భీం విగ్రహాన్ని కిషన్‌రెడ్డి కడిగి, అలంకరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్‌ కృషి, వారసత్వాన్ని గౌరవిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అంబేడ్కర్‌ జీవితానికి సంబంధించిన 5 ముఖ్యమైన ప్రదేశాలను ‘పంచ తీర్థాలు’గా తీర్చిదిద్దిందని తెలిపారు. రాజ్యాంగానికి రూపకల్పన చేసి, సామాజిక న్యాయ సంస్కరణలకు అంబేడ్కర్‌ అసమానమైన కృషి చేసినా, కాంగ్రెస్‌ ఆయనకు గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు. కనీసం ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్‌లో పెట్టేందుకు చర్యలు తీసుకోలేదన్నారు.


అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించింది: సంజయ్‌

అంబేడ్కర్‌ను ఓడించిన, అవమానించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. 1951లో హిందూ కోడ్‌ బిల్లు, సామాజిక న్యాయ సాధికారత అంశాలపై అంబేడ్కర్‌ అభిప్రాయాలను నెహ్రూ వ్యతిరేకించారని, దీంతో మనస్తాపం చెందిన అంబేడ్కర్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. 1954 ఉప ఎన్నికలో అంబేడ్కర్‌పై అభ్యర్థిని నిలబెట్టి ఆయనను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో సంజయ్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ అంబేడ్కర్‌ను అవమానించడం తప్ప గౌరవించలేదని ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. ‘చలో గావ్‌.. చలో బస్తీ’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌లోని పులాంగ్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహాన్ని అర్వింద్‌ శుభ్రం చేశారు. పవన్‌ కల్యాణ్‌ త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారని.. కవిత ఏం త్యాగం చేసి వచ్చిందని ప్రశ్నించారు. కాగా, కంచ గచ్చిబౌలిలోని సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను టీజీఐఐసీకి బదిలీ చేసింది వాస్తవం కాదా..? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. మంత్రి శ్రీధర్‌బాబును ప్రశ్నించారు. ఆ భూములను తాకట్టుపెట్టి రుణం తీసుకోవడంపై శ్రీధర్‌బాబు ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూములను తెలివిగా టీజీఐఐసీకి బదిలీ చేసి, దాని ద్వారా రుణం తీసుకుందని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:08 AM