Medchal-Malkajgiri: రోడ్డు ప్రమాదం.. కుటుంబం చిన్నాభిన్నం
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:02 AM
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం లారీ బైక్ను ఢీకొన్న ఘటనలో తల్లితండ్రి, కుమార్తె మృతి చెందగా, నాలుగేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

లారీ బైక్ను ఢీకొని తల్లి, తండ్రి, కుమార్తె మృతి
కుమారుడికి తీవ్ర గాయాలు.. మేడ్చల్లో ఘటన
మేడ్చల్ టౌన్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం లారీ బైక్ను ఢీకొన్న ఘటనలో తల్లితండ్రి, కుమార్తె మృతి చెందగా, నాలుగేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామానికి చెందిన బుల్లబ్బాయి (37) హైదరాబాద్లోని ఉప్పల్లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. బుల్లబ్బాయి ఆయన మిత్రుడు వెంకటేశ్వరావును కలవడానికి భార్య సాగి లావణ్య (30) కూతురు హర్షిత (10), నాలుగేళ్ల కుమారుడు సిద్దేశ్వర్తో కలిసి బైక్పై మేడ్చల్ మండలం ఎల్లంపేటకు బయల్దేరారు.
ఈ క్రమంలో మేడ్చల్ చెక్పోస్టు వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వీరి బైక్ను అతివేగంగా ఢీకొట్టింది. దీంతో బుల్లబ్బాయి, లావణ్య, హర్షిత అక్కడికక్కడే మృతి చెందగా సిద్దేశ్వర్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిద్దేశ్వర్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.