‘ఫ్యాప్టో’ ఆందోళనకు సంపూర్ణ మద్దతు
ABN , First Publish Date - 2021-07-22T08:59:12+05:30 IST
సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఈ నెల 23న చేయనున్న రాష్ట్రవ్యాప్త ధర్నా, ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డి తెలిపారు

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, టీఎన్యూఎస్
అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఈ నెల 23న చేయనున్న రాష్ట్రవ్యాప్త ధర్నా, ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డి తెలిపారు. మూడేళ్లు గడిచినా 11వ పీఆర్సీ అమలుకాలేదని, డీఏ విడుదలకు ఇచ్చిన 94జీవో సైతం అమలుకు నోచుకోలేదన్నారు. సమస్యలపై వెంటనే చర్చలకు ఆహ్వానించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. మరోవైపు ఫ్యాప్టో ధర్నాలకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పారావు మూకల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడిపినేని వెంకట్రావులు తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా వెనకబడిన జిల్లాల్లో కేంద్రం 194 ఆదర్శ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలపడం, దీనిలో రాష్ట్రానికి 8 కళాశాలలు రావడం హర్షణీయమని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో నడిచే ఈ కళాశాలలకు ఒక్కో కళాశాలకు రూ.12 కోట్లు చొప్పున కేంద్రం విడుదల చేసిందన్నారు.