సోనియాగాంధీని కలిసిన మెహబూబా ముఫ్తీ
ABN , First Publish Date - 2022-04-19T02:20:17+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారంనాడు కలుసుకున్నారు. సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో ఉభయులూ దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. భారతీయ జనతా పార్టీ మరిన్ని పాకిస్థాన్లను ఏర్పాటు చేయాలని కోరుకుంటోందని, దేశాన్ని ఇంతవరకూ సురక్షితంగా ఉంచిన పార్టీ కాంగ్రెస్ అని సోనియాతో మెహబూబా ముఫ్తీ అన్నట్టు తెలుస్తోంది.
మెహబూబా ముఫ్తీ 2016లో బీజేపీ మద్దతుతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే పొత్తు పెటాకులు కావడంతో ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగలేదు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను కేంద్రం రద్దు చేయడంతో రెండు పార్టీల మధ్య మరింత చిచ్చు రగిలింది. పలు సందర్భాల్లో మెహబూబా ముఫ్తీని జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ముందు జాగ్రత్తగా గృహనిర్బంధంలో ఉంచింది.