ఓపీఎస్సే కావాలి
ABN , First Publish Date - 2023-07-09T02:00:08+05:30 IST
సీపీఎ్సను రద్దు చేసి ఓపీఎ్సను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శ

అమలు చేసేంతవరకు ఉద్యమం ఆగదు
వచ్చే ఎన్నికల్లో ప్రతిఘటన తప్పదు
సీపీఎస్, జీపీఎస్ వద్దు .. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద
సీపీఎస్ ఉద్యోగుల ధర్నా
సీఎం ప్రాపకం కోసం నేతలు పాకులాడుతున్నారని ధ్వజం
అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సీపీఎ్సను రద్దు చేసి ఓపీఎ్సను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శనివారం ఏపీసీపీఎ్సఈఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. జగన్ సర్కార్ కొత్తగా ప్రతిపాదించిన జీపీఎ్సను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, పాత పెన్షన్ విధనం అమలు చేసేంత వరకు ఉద్యమం ఆపేదిలేదని హెచ్చరించారు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ మాట తప్పారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సీఎం ప్రాపకం కోసం కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు పాకులాడుతున్నారని విమర్శించారు. జీపీఎస్ బాగుందన్న జేఏసీ నాయకులు ముందుగా వారు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయించుకోవాలని మండిపడ్డారు. మాట తప్పవద్దు, మడమ తిప్పవద్దు, సీపీఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, ఓపీఎస్సే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. ఏపీసీపీఎ్సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రామనరసింహ కర్నూలు జిల్లాలో, సహాధ్యక్షుడు సీఎందాస్ విజయవాడ ధర్నాచౌక్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ హృదయరాజు, ఎస్టీయూ అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు రాజేష్, నాపా ప్రసాద్, ఏపీఎన్జీవో వెస్ట్ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు విజయవాడ ధర్నా చౌక్లో పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట, ఏపీటీఎఫ్(257) రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల ప్రకాశం జిల్లా కలెక్టరేట్ల ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జీపీఎస్ పేరెత్తితే కొడతాం
విజయవాడలో ధర్నాచౌక్ వద్ద చేపట్టిన ధర్నాలో పలువురు సీపీఎస్ ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాల నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. జీపీఎ్సను అంగీకరిస్తున్నామంటూ సంఘాల నేతలు ఇకపై ఎక్కడైనా మాట్లాడితే పరిగెత్తిచ్చి కొడతామని ఓ ఉద్యోగి హెచ్చరించారు. ‘మా భవిష్యత్తుపై మీకేం హక్కు? విధివిధానాలు తెలియకుండానే జీపీఎ్సను ఎలా అంగీకరిస్తారు? ప్రభుత్వం, సీఎం ప్రాపకం కోసం పాకులాడుతూ మా భవిష్యత్తును బలి చేస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.