Share News

NDA Government: వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు

ABN , Publish Date - Jun 20 , 2024 | 04:32 AM

కేంద్రంలో కొత్తగా కొలువైన ఎన్డీయే సర్కారు రైతులకు తీపికబురు చెప్పింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త క్యాబినెట్‌..

NDA Government: వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు

  • కేంద్ర క్యాబినెట్‌ తొలి సమావేశంలో నిర్ణయం

  • రూ.72,600 కోట్లతో మహారాష్ట్రలోని వధావన్‌లో

  • అతి పెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ఆమోద ముద్ర

  • తీరప్రాంత పవనశక్తి ప్రాజెక్టుల అమలుకు వీజీఎఫ్‌ స్కీమ్‌

  • రూ.2,254 కోట్లతో ఫోరెన్సిక్‌ ఇన్‌ఫ్రా విస్తరణకు ఓకే

న్యూఢిల్లీ, జూన్‌ 19: కేంద్రంలో కొత్తగా కొలువైన ఎన్డీయే సర్కారు రైతులకు తీపికబురు చెప్పింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త క్యాబినెట్‌.. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) పెంపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ రైతులకు ప్రాధాన్యం ఇస్తారని.. అందుకే మూడోసారి ఎన్నికయ్యాక ఆయన తీసుకున్న తొలి నిర్ణయం కూడా రైతుల కోసమేనని పేర్కొన్నారు. కనీస మద్దతుధర అనేది.. ఉత్పత్తి ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఉండాలంటూ 2018 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకుందని ఆయన గుర్తుచేశారు.

బుధవారం క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం అందుకు అనుగుణంగానే ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు జిల్లాలు, తాలూకాల్లో.. ‘కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసెస్‌’ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఉత్పత్తి ఖర్చును శాస్త్రీయంగా లెక్కించినట్టు మంత్రి వివరించారు. తాజాగా ప్రకటించిన మద్దతు ధరల్లో వరికి గతేడాదితో పోలిస్తే రూ.117 పెరిగింది. కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. రైతులు నిరుటితో పోలిస్తే రూ.35 వేల కోట్ల మేర అదనంగా లబ్ధి పొందుతారని అంచనా. కాగా.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ డిమాండ్లతోపాటు.. హరియానా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల శాసనసభలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మద్దతు ధరలను పెంచడం గమనార్హం.


మరికొన్ని నిర్ణయాలు..

  • 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుతో పాటు కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు..

  • మహారాష్ట్రలోని వధావన్‌లో రూ.76,200 కోట్లతో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ఆమోదం; నిర్మాణం పూర్తయితే.. ప్రపంచంలోని టాప్‌-10 పోర్టుల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని అంచనా.

  • తీర ప్రాంత పవనశక్తి ప్రాజెక్టులకు సంబంధించి.. రూ.7,453 కోట్లతో వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) స్కీమ్‌ అమలుకు పచ్చజెండా. తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో 500 మెగావాట్ల చొప్పున నిర్మించే ఒక గిగావాట్‌ పవనశక్తి కేంద్రాల నిర్మాణానికి అయ్యే రూ.6,853 కోట్లు ఈ పథకం ద్వారానే ఖర్చుపెట్టనున్నారు.

  • రూ.2,870 కోట్లతో.. వారాణసీ నగరంలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ప్రతిపాదనలకు అంగీకార ముద్ర. ఆ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ భవన నిర్మాణంతోపాటు, రన్‌వేను విస్తరణకు చేసిన ప్రతిపాదనలను క్యాబినెట్‌ ఆమోదించింది.

  • రూ.2,254 కోట్ల ఖర్చుతో.. 2024-2029 నడుమ దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్‌ మౌలిక సదుపాయాల విస్తరణకు క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది. ఈ నిధులతో.. ఫోరెన్సిక్‌ ల్యాబుల ఏర్పాటు, ఢిల్లీలో ఉన్న నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా కొత్త క్యాంప్‌సల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.

Updated Date - Jun 20 , 2024 | 04:32 AM