Share News

Kerala Landslide: అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:23 AM

కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో పరిస్థితి భీతావాహంగా మారింది. మెప్పాడిలో గల పలు ప్రాంతాల్లో కొండచరియలు నేరుగా ఇళ్లపై పడ్డాయి. దీంతో 24 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం ఆర్మీ సాయం కావాలని కోరింది.

Kerala Landslide: అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా
PM Modi Assures To Kerala CM

వయనాడు: కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో (Wayanad) పరిస్థితి భీతావాహంగా మారింది. మెప్పాడిలో గల పలు ప్రాంతాల్లో కొండచరియలు నేరుగా ఇళ్లపై పడ్డాయి. దీంతో 43 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం ఆర్మీ సాయం కావాలని కోరింది. దాంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది. కొండచరియలు విరిగిపడటంతో మండక్కై, చూరల్‌మాల, అట్టమాల, నూల్పూజ గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది.


రంగంలోకి ఆర్మీ

వయనాడులో కొండచరియల బీభత్సం సృష్టించడంతో ఆర్మీ 225 మంది సిబ్బందిని పంపించింది. వీరిలో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ల సేవలను వినియోగిస్తున్నారు. పరిస్థితి తీవ్రతత దృష్ట్యా భారత నౌకాదళం సేవలను వినియోగించుకుంటామని కేరళ మంత్రి వీణ జార్జ్ ప్రకటించారు. కొండచరియల విరిగిపడటంతో మలప్పురంలోని నీలంబర్ ప్రాంతానికి వెళ్లే వంతెన కొట్టుకొని పోయింది.


అండగా ఉంటాం

వయనాడులో కొండచరియలు విరిగిపడటంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందజేస్తామని ప్రకటించారు. ‘వయనాడులో కొండచరియలు విరిగిపడిన ఘటన బాధాకరం. ఈ విషాద ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. కొన్ని గ్రామాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. ఈ కష్ట సమయంలో కేరళ ప్రభుత్వానికి అండగా ఉంటాం, కావాల్సిన సాయం అందజేస్తాం అని’ ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


కేంద్రమంత్రులు

వయనాడు అంశంపై కేంద్ర మంత్రులు సురేష్ గోపి, జార్జ్ కురియన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలుసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని మోదీ సూచించారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.


Read More National News
and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 01:55 PM