Share News

నాడు న్యాయం కోసం నేడు దేశం కోసం

ABN , Publish Date - Aug 07 , 2024 | 03:38 AM

ఏడాది క్రితం మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో వినేశ్‌ కీలకపాత్ర పోషించింది...

నాడు న్యాయం కోసం నేడు దేశం కోసం

సివంగి..

‘ఆమె.. మన సివంగి. డిఫెండింగ్‌ చాంప్‌ను ఓడించిన వినేశ్‌. వెంటనే మరో మాజీ వరల్డ్‌ చాంపియన్‌పై గెలవడం అద్భుతం. ఆమె ప్రపంచాన్ని జయించబోతోంది’

బజ్‌రంగ్‌ పూనియా.

ఏడాది క్రితం సరిగ్గా రోడ్డుపైనే నిద్రించింది.. మానసికంగా ఎంతో వేదనకు గురైంది.. ప్రాక్టీస్‌ను కోల్పోయింది.. మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుంది... కొన్నాళ్లు ఆటకు దూరమైంది.. అసలు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుందా అన్న సంశయాన్ని దాటుకొని పారిస్‌ క్రీడలకు ఎంపికైంది.. ఇన్ని సవాళ్లు, ప్రతికూలతల మధ్యే పోటీపడింది. గెలవాలన్న కసితో, సంకల్ప బలంతో ముందుకు సాగింది.. రౌండ్‌ రౌండ్‌కు ప్రత్యర్థులను ఉడుం పట్టుతో హడలెత్తిస్తూ ఏకంగా స్వర్ణపోరులో నిలిచింది. ఇలా.. తానెదుర్కొన్న విమర్శలు, అవమానాలన్నింటికీ ఆటతోనే బదులిచ్చిన పోరాట యోధురాలు వినేశ్‌ ఫొగట్‌.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఏడాది క్రితం మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో వినేశ్‌ కీలకపాత్ర పోషించింది. రోజుల తరబడి సహచర రెజ్లర్లతో కలిసి ధర్నాలో పాల్గొంది. ఆపై అరెస్టయింది. పోలీసుల దాష్టీకాన్ని చవిచూసింది.


ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమాత్రం కనికరించలేదు. బ్రిజ్‌భూషణ్‌ను తిరిగి రెజ్లింగ్‌ సమాఖ్యలోకి రానివ్వకుండా చేసేందుకు ఆమె అన్ని ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో తాను సాధించిన ఖేల్‌రత్న లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను సైతం వెనక్కిచ్చేసింది. ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొంది. అయినా వెనక్కి తగ్గలేదు. చివరకు అనుకున్నది సాధించింది. బ్రిజ్‌భూషణ్‌ తిరిగి సమాఖ్య ఎన్నికలకు దూరమవడంతో మళ్లీ ఆటపై దృష్టి పెట్టింది. ఈ సమయంలోనే మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఏడాదిపాటు ఆటకు దూరమైంది. అయినా వెరవలేదు. శిక్షణలో రాటుదేలింది. ఈ సమయంలోనే తాను పోటీపడాల్సిన 53 కిలోల విభాగంలో అంతిమ్‌ ఫంగల్‌ ఒలింపిక్స్‌ కోటా గెలిచింది. దీంతో తన బరువు విభాగాన్ని 50 కిలోలకు మార్చుకుంది. అందులో జాతీయ సెలెక్షన్స్‌లో నెగ్గి ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో పోటీపడింది. అదే జోష్‌లో వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌కు ఎంపికై ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. 50 కిలోల విభాగంలో భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ప్రీ క్వార్టర్స్‌ బౌట్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌, టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత సుసాకి రూపంలో ఎదురైన సవాల్‌ను సమర్ధవంతంగా అధిగమించింది. ఆ తర్వాత క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌ రెజ్లర్‌ ఒక్సానాను చిత్తుచేసి సెమీ్‌సకు చేరడంతో వినేశ్‌ ఆనందానికి హద్దుల్లేవు. ఇక సెమీ్‌సలో క్యూబా అమ్మాయి గుజ్‌మాన్‌ను చిత్తుచేసి భారత రెజ్లింగ్‌ చరిత్రలో తన ప్రస్థానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.నాడు కన్నీళ్లు పెట్టుకున్న ఆ వనితే.. ఇప్పుడు విశ్వవేదికపై యోధురాలిలా పోరాడి దేశానికి గర్వకారణమైంది.

Updated Date - Aug 07 , 2024 | 03:38 AM