Sunkishala Project: సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్పై బదిలీ వేటు
ABN, Publish Date - Aug 15 , 2024 | 03:45 AM
సుంకిశాల ఇన్టేక్ వెల్లో టన్నెల్ గేటు ధ్వంసమై రక్షణ గోడ కూలిపోయిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్సగా తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు వేసింది.
నలుగురు వాటర్ బోర్డు అధికారుల సస్పెన్షన్
రక్షణ గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్
విచారణ కమిటీ నివేదికతో అధికారులపై చర్యలు
ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు
504 అడుగుల టన్నెల్లో సాగర్ వైపు మట్టిని
తొలగించకుంటే ప్రమాదం తప్పేదన్న అభిప్రాయం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సుంకిశాల ఇన్టేక్ వెల్లో టన్నెల్ గేటు ధ్వంసమై రక్షణ గోడ కూలిపోయిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్సగా తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు వేసింది. ఈ ప్రాజెక్టు విభాగ సీజీఎం కిరణ్కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ చర్యలు చేపట్టారు. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని వాటర్బోర్డుకు ఆదేశాలిచ్చారు. సుంకిశాల ఘటనపై విచారణకు ప్రభుత్వం వారం రోజుల క్రితమే వాటర్బోర్డు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో, ఈ కమిటీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందజేసింది. కమిటీ రిపోర్టు ఆధారంగా బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టారు. వాటర్బోర్డు కమిటీ సభ్యులు వారం రోజులుగా సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును సందర్శించడంతో పాటు అక్కడ పనిచేసే ఇంజనీర్లు, కార్మికులతో మాట్లాడి నివేదికను రూపొందించారు. సుంకిశాల ఇన్టేక్ వెల్కు మూడు టన్నెళ్లను ఏర్పాటు చేసి, రిజర్వాయర్ వైపు నుంచి నీళ్లు రాకుండా అక్కడ మూడింటికి మట్టిపోసి పెట్టారు. అయితే, ఇన్టేక్ వెల్ వైపు 504 అడుగుల టన్నెల్కు గేటును ఏర్పాటు చేసే క్రమంలోనే ఆ టన్నెల్లో రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు.
దీన్ని కమిటీ తప్పు పట్టింది. టన్నెల్కు గేటు బిగింపు పనులు జూలై 29, 30, 31 తేదీల్లో చేసే క్రమంలోనే నాగార్జున్సాగర్కు ఎగువ నుంచి వరద పెద్దఎత్తున వస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కమిటీ తన నివేదికలో ఆక్షేపించినట్లు సమాచారం. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్న సందర్భంలో కూడా పనులు చేసిన అనుభవముందని నిర్మాణ సంస్థకు చెందిన కొందరు ఇంజనీర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని, లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నా గేటు బిగింపు పనులు చేయడంపై వాటర్బోర్డు ఇంజనీర్లు అభ్యంతరం చెప్పలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
మట్టి అలాగే ఉంటే ప్రమాదం జరిగేది కాదు!
ఆగస్టు 2న శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 4.99లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఆ నీళ్లు నాగార్జునసాగర్లో అప్పటికే ఉన్న నీళ్లను తాకి భారీ అలలను సృష్టించడంతో పాటు, సాగర్లోని నీళ్లు వరద నీటిని వెనక్కి నెట్టడంతో(బ్యాక్ క్లోజ్ వేవ్ యాక్షన్) ఆ ప్రభావం సుంకిశాల ఇన్టెక్ వెల్ టన్నెల్ గేట్పై పడిందని నివేదిక వివరించింది. ఈ అలల ప్రభావం వల్లనే సుంకిశాలలో రక్షణ గోడ కూలిపోయిందని కమిటీ అభిప్రాయపడింది. టన్నెల్కు రిజర్వాయర్ వైపు మట్టి అలాగే ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని తెలిపింది. కాగా, సుంకిశాల ప్రమాద ఘటనపై మరో ఉన్నతస్థాయి విచారణకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఆదేశాలిచ్చారు.
Updated Date - Aug 15 , 2024 | 03:45 AM