Prajavani portal: ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్!
ABN, Publish Date - Jul 18 , 2024 | 02:56 AM
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘ప్రజావాణి’ ఫిర్యాదులకు ట్రాకింగ్ సౌకర్యాన్ని కల్పించనుంది. అలాగే ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన పరిష్కారం సరిగాలేదని సదరు ఫిర్యాదుదారు భావిస్తే అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం కల్పించనుంది.
ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు
పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీల్కు వెళ్లొచ్చు
అవకాశం కల్పించనున్న ప్రభుత్వం.. ప్రక్రియపై అధికారుల కసరత్తు
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘ప్రజావాణి’ ఫిర్యాదులకు ట్రాకింగ్ సౌకర్యాన్ని కల్పించనుంది. అలాగే ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన పరిష్కారం సరిగాలేదని సదరు ఫిర్యాదుదారు భావిస్తే అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం కల్పించనుంది. ఇందుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్లోని ప్రజాభవన్లో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజాభవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీ పెట్టుకుంటున్నారు.
ఇలా వచ్చిన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ చేయడంతోపాటు ప్రతి ఫిర్యాదుకు ఒక ఐడీ నంబర్ను కేటాయిస్తూ దాన్ని అర్జీదారు ఫోన్కు సందేశం రూపంలో పంపుతున్నారు. అయితే సదరు ఫిర్యాదు ఏ దశలో ఉన్నదో ఫిర్యాదుదారుడు తెలుసుకునే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రజావాణిని పర్యవేక్షిస్తున్న అధికారులకే ఆ అధికారం ఉంది. దీంతో తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకే చాలా మంది ప్రజావాణి నిర్వహిస్తున్న రోజుల్లో వస్తున్నట్టు అఽధికారులు గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఫిర్యాదు ఏ దశలో ఉందనేది తెలుసుకునేందుకు వీలుగా అర్జీదారుడికే లాగిన్ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం ఫిర్యాదు చేసినప్పుడు కేటాయించిన ఐడీ నంబర్నే లాగిన్ ఐడీగా ఉపయోగించేందుకు వీలుగా అధికారులు పోర్టల్ను అందుబాటులోకి తేనున్నారు.
త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఫిర్యాదు ఇచ్చాక లభించిన పరిష్కారంపై సదరు అర్జీదారుడు సంతృప్తి చెందకుంటే అదే ఫిర్యాదుపై అప్పీల్కు వెళ్లే అవకాశం కల్పించనున్నారు. ఫిర్యాదుదారులు నేరుగా ఆన్లైన్లోనే అప్పీల్కు వెళ్లేలా పోర్టల్ను అందుబాటులోకి తేనున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. కాగా ట్రాకింగ్, అప్పీల్తోపాటు మరో ప్రత్యేక సౌకర్యాన్ని అధికారులు ప్రజావాణి పోర్టల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. ఫిర్యాదును స్వీకరించాక వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కానీ ఫిర్యాదుల్లో కొన్నింటి పరిష్కారం జరగడంలేదు. పరిష్కారంకాని వాటిపై అర్జీదారులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై పరిష్కారమైన సమస్యను ఏ విధానంలో పరిష్కరించారు, దానికి కారణాలను తెలిపేలా, అదే సమయంలో కొన్ని ఫిర్యాదులు ఎందుకు పరిష్కారంకాలేదు, అందుకు గల కారణాలేంటనే వివరాలను తెలుపుతూ.. సంబంధిత పత్రాలను స్కాన్ చేసి పోర్టల్లో అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఫిర్యాదుదారుడి సమస్యకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్లైన్లోనే అందుబాటులో ఉండనున్నాయి. తద్వారా ప్రజావాణి కూడా మరింత పారదర్శకంగా ఉంటుందని అధికారికవర్గాలు అంటున్నాయి
Updated Date - Jul 18 , 2024 | 02:56 AM