అంబేడ్కర్.. అందరికీ ఆదర్శం
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:17 AM
భారతరత్న డాక్టర్ అంబేద్కర్ నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలకు ఆదర్శం, స్ఫూర్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ పురందేశ్వరి, జేసీ చిన్నరాముడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): భారతరత్న డాక్టర్ అంబేద్కర్ నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలకు ఆదర్శం, స్ఫూర్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ పురందేశ్వరి, జేసీ చిన్నరాముడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ కేక్ కట్ చేశారు. దాతల సహకారంతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగకర్తే కాదు, మంచి దార్శనికుడు అని కొనియాడారు. ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే రాజ్యాంగంలో ఆయన పొందుపరచిన అధికరణలే అని అన్నారు. ఎస్పీ కిషోర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరూ పాటించి ఉన్నతస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. యువత రాజ్యాంగ స్ఫూర్తిని పాటించేవిధంగా అడుగులు వేయాలని అన్నారు. జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి అని, ఎన్ని కష్టాలు వచ్చినా చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతచదువులు చదవాలని అన్నారు. ఎమ్మెల్సీ సోము మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని అన్నారు. ముందుగా రాజమహేంద్రవరం వై.జంక్షన్ నుంచి గోకవరం బస్టాండు అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణనాయక్, కార్పొరేషన్ అదనపు కమిషనర్ వి.రామలింగేశ్వరరావు, ఏఎస్పీ మురళీకృష్ణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ కోమల, సాంఘిక సంక్షేమ అధికారిణి శోభారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, హాస్టళ్ల విద్యార్థులు పాల్గొన్నారు.