CM Chandrababu: ఆ రైతుల కోసం కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. అమెరికాతో చర్చలు జరపాలంటూ..

ABN, Publish Date - Apr 06 , 2025 | 07:52 PM

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సీ ఫుడ్ ఎగుమతి అయ్యిందని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నట్లు చెప్పారు. కానీ, ప్రస్తుతం అమెరికా సుంకాలతో ఆక్వా రంగం ఇబ్బందులు పడుతోందని చెప్పుకొచ్చారు.

CM Chandrababu: ఆ రైతుల కోసం కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. అమెరికాతో చర్చలు జరపాలంటూ..
CM Chandrababu

అమరావతి: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తోందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.


సీఎం చంద్రబాబు లేఖలో ప్రస్తావించిన అంశాలివే..

"భారతదేశం నుంచి వెళ్లే సముద్రపు ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్రపు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నాయి. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతాంగం నష్టపోతోంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే విధిస్తోంది అమెరికా. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ.. వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్‌ వెయిలింగ్ డ్యూటీ (CVD) భారాన్ని మోస్తున్నారు. అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్‌కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటోంది.


ట్రంప్ సర్కార్ విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోంది. గతంలో వచ్చిన ఆర్డర్లకు సంబంధించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేయబడి కోల్డ్ స్టోరేజ్‌లు, పోర్టుల్లో ఉన్నాయి. కొత్త నిబంధనల కారణంగా ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతోంది. యూరోపియన్ యూనియన్‌లో భారతీయ ఎగుమతిదారులు 50 శాతం తనిఖీ రేట్లు, 4 నుంచి 7 శాతం వరకూ దిగుమతి సుంకంతో సహా నాన్-టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. కానీ, వియత్నాం వంటి దేశాలు ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA) కింద జీరో డ్యూటీ పొందుతున్నాయి. ఈ కారణంగా వియత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్‌ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయి. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాలు భారతదేశం నుంచి సీఫుడ్‌ కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయి.


అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల కారణంగా ఆ దేశాలూ మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో శీతల గిడ్డంగులూ నిండిపోవడంతో చేతికి వచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో తెలియని గందరగోళ పరిస్థితిలో రైతాంగం ఉంది. మరోవైపు ఇంకా పంట సిద్ధంగా ఉంది. 27 శాతం సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు ఎదురయ్యాయి. సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరుతున్నా. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తే ఆక్వాపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చు" అంటూ లేఖ రాశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్

Updated Date - Apr 06 , 2025 | 07:52 PM