నేటి నుంచి ఒంటి పూట బడులు
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:39 PM
అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యజమాన్య పాఠశాలల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామూల్ పాల్ శుక్రవారం తెలిపారు.

కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యజమాన్య పాఠశాలల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామూల్ పాల్ శుక్రవారం తెలిపారు. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని తెలిపారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేస్తాయన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా, గ్రామ పంచాయతీ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో తాగునీటి వసతి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పాఠశాలలో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పాఠశాలల పనివేళలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు వర్తించాలన్నారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు తమ పాఠశాలల పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా హెచ్ఎంలు ఏర్పాటు చేసుకునేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు.