ఆంధ్రకు జగన్ ఒక పర్యాటక అతిథి: మంత్రి సవిత
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:30 AM
మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండగా, జగన్ పర్యాటక అతిథిలా వచ్చి వెళుతున్నారని విమర్శించారు. వైసీపీ మాజీ మంత్రుల అవినీతి బయటపడుతుందని, దోచుకున్న సొమ్మును రికవరీ చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు

పెనుకొండ టౌన్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ‘ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 10 నెలల పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోంది. అలాంటి ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక పర్యాటక అతిథిలా వచ్చి వెళుతున్నారు’ అని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయు జిల్లా పెనుకొండలో మంగళవారం ఆమె ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తప్పు చేసిన వారికి భయం పట్టుకుంది. ఆ భయంతో కొందరు బాత్రూంలలో జారి పడుతున్నారు. మరికొందరు ఆస్పత్రులకు, ముంబయికి పారిపోతున్నారు. అవినీతికి పాల్పడినవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అవినీతికి పాల్పడినవారు ఎక్కడున్నా బయటకు తీస్తాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వైసీపీ మాజీ మంత్రుల అవినీతి చిట్టా బయటకు వస్తుంది. దోచుకున్న సొమ్మును రికవరీ చేసి, ప్రజలకు అంకితం చేస్తాం. జగన్ పార్టీ పని అయిపోయింది. కాంగ్రెస్ పిలుస్తుందా..! లేక మనమే జంప్ అవుదామా? అని జగన్ ఆలోచిస్తున్నారు’ అని మంత్రి సవిత విమర్శించారు.