Share News

Mark Shankar Pawanovich: పవన్ కళ్యాణ్ కొడుకు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడంటే..

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:01 PM

Mark Shankar Pawanovich: స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనో విచ్ కొద్దికొద్దిగా కొలుకొంటున్నాడు. ఐసీయూ నుంచి అతడిని గదిలోకి మార్చారు. మరి కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో అతడు ఉండాలని సూచించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలియగానే చిరంజీవి దంపతులతోపాటు పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.

Mark Shankar Pawanovich: పవన్ కళ్యాణ్ కొడుకు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 09: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా.. పలువురు గాయపడ్డారు. వారిలో మార్క్ శంకర్ ఉన్నారు. అతడి కాళ్లు, చేతులకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో.. అతడికి వైద్యులు అత్యవసర విభాగంగా ఉంచి చికిత్స అందించారు. అనంతరం బుధవారం మరో గదిలోకి అతడిని మార్చారు.

మరికొద్ది రోజులు ఆ బాలుడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారని తెలుస్తోంది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫొటోను విడుదల చేశారు.ఈ ఫొటో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా పర్యటిస్తున్నారు. ఆ సమయంలో అతడి కుమారుడు మార్క్ శంకర్ చదువుతోన్న సింగపూర్‌లోని స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.


ఈ ప్రమాదంలో బాలుడికి కాళ్లు, చేతులకు గాయాలైనట్లు పవన్ కళ్యాణ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన సింగపూర్ వెళ్లాలని నిర్ణయించారు. ఆ క్రమంలో పెద్ద సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ బయలుదేరి వెళ్లారు. మరోవైపు సింగపూర్‌లో మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ.. స్వయంగా పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు.


ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే మార్క్ శంకర్ ఆరోగ్యంపై పర్యవేక్షించాలంటూ సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులను మోదీ కీలక సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు కూడా మార్క్ శంకర్ ఆర్యోగం గురించి పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 05:01 PM