Share News

లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:25 AM

సీలేరు కాంప్లెక్సు పరిధిలో 2024-25 వార్షిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి చేశామని సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ 2024 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2025 మార్చి 31 వరకు సీలేరు కాంప్లెక్సులోని మాచ్‌ఖండ్‌, ఎగువ సీలేరు, డొంకరాయి, పొల్లూరు నాలుగు జల విద్యుత్‌ కేంద్రాలకు సెంట్రల్‌ విద్యుత్‌ అథారిటీ 2286.14 మిలియన్‌ యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు.

లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి
పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రం

- సీలేరు కాంప్లెక్సుకు నిర్దేశించిన లక్ష్యం 2286.14 మిలియన్‌ యూనిట్లు

- సాధించిన ఉత్పత్తి 2453.7 మిలియన్‌ యూనిట్లు

- 167.56 మిలియన్‌ యూనిట్లు అధికంగా ఉత్పత్తి

- పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో శరవేగంగా 5,6 యూనిట్ల పనులు

- సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ వాసుదేవరావు

సీలేరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలో 2024-25 వార్షిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి చేశామని సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ 2024 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2025 మార్చి 31 వరకు సీలేరు కాంప్లెక్సులోని మాచ్‌ఖండ్‌, ఎగువ సీలేరు, డొంకరాయి, పొల్లూరు నాలుగు జల విద్యుత్‌ కేంద్రాలకు సెంట్రల్‌ విద్యుత్‌ అథారిటీ 2286.14 మిలియన్‌ యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. ఇందులో మాచ్‌ఖండ్‌కు 630 మిలియన్‌ యూనిట్లు, ఎగువ సీలేరుకు 477 మిలియన్‌ యూనిట్లు, డొంకరాయి 95.14 మిలియన్‌ యూనిట్లు, పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి 1,084 మిలియన్‌ యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించిందని చెప్పారు. కాంప్లెక్సు పరిధిలో ఒక్క మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం మినహా ఎగువ సీలేరు, డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రాలు నిర్దేశించిన సమయం కంటే ఒక నెల ముందుగానే లక్ష్యాన్ని అధిగమించాయని, డొంకరాయి మినీ జలవిద్యుత్‌ కేంద్రంలో రెండు నెలలు ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. మార్చి 31 నాటికి సీలేరు కాంప్లెక్సులో ఓవరాల్‌గా 2453.7 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి చేశామని, సెంట్రల్‌ విద్యుత్‌ అథారిటీ నిర్దేశించిన లక్ష్యం కంటే 167.56 మిలియన్‌ యూనిట్లు అధికంగా విద్యుదుత్పత్తి చేశామని ఆయన వెల్లడించారు. మాచ్‌ఖండ్‌లో మూడు యూనిట్లకు ఆర్‌ఎల్‌ఏ స్టడీస్‌ నేపథ్యంలో విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడలేదన్నారు. ఈ ఏడాది సీలేరు కాంప్లెక్సులోని జల విద్యుత్‌ కేంద్రాలకు నీటి కొరత లేదని, గ్రిడ్‌ అధికారుల ఆదేశాల మేరకు విద్యుదుత్పత్తిని నిర్వహించనున్నామన్నారు. కాగా పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో 115 మెగావాట్ల సామర్థ్యం గల 5, 6 యూనిట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మరో ఏడాదిలో యూనిట్లు వినియోగంలోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.

Updated Date - Apr 02 , 2025 | 12:25 AM