ముస్లింల చేతుల్లోనే ‘వక్ఫ్’ నిర్వహణ: ఫరూక్
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:11 AM
ముస్లింలే వక్ఫ్ నిర్వహణను కొనసాగిస్తారని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుపై టీడీపీ సూచనల ప్రకారం కేంద్రం నాలుగు సవరణలను ఆమోదించినట్టు తెలిపారు.

అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ‘వక్ఫ్’ నిర్వహణ ముస్లింల చేతుల్లోనే ఉంటుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచనతోనే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం జేపీసీకి పంపితే, టీడీపీ సూచించిన సవరణల్లో నాలుగింటిని ఆమోదించినట్లు చెప్పారు. వక్ఫ్ బిల్లుపై లోక్సభలో వ్యతిరేకించి, రాజ్యసభలో ఓకే చెప్పిన వైసీపీ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లులో ప్రతిపాదనలు, జేపీసీ, కేంద్రం దృష్టికి టీడీపీ తీసుకెళ్లిన అభ్యంతరాలు, బిల్లులో జరిగిన మార్పులు, కొత్త వక్ఫ్ చట్టంలోని కీలకమైన అంశాలపై శనివారం మంత్రి వివరించారు. ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు, జమాత్ల పెద్దలు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి వక్ఫ్ బిల్లుపై అభిప్రాయాలు వివరించారు. వక్ఫ్ ఆస్తుల వివరాలన్నీ ఆన్లైన్ పోర్టల్లో నమోదు వల్ల పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని, ఆగాఖాన్ వక్ఫ్, బోహ్రా వక్ఫ్లు ఉన్న రాష్ట్రాల్లో వారికి ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటుకు ఈ చట్టం దోహదపడుతుందని అన్నారు.