అర లీటర్ పెట్రోలు రూ.100
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:46 AM
స్థానిక హెచ్పి పెట్రోల్ బంకులో ఘరానా మోసం బయటపడింది. రూ.100 పెట్రోలు అడిగితే అర లీటరు మాత్రమే రావడంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు.

కాళ్ళ బంక్లో ఘరానా మోసం
కాళ్ళ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక హెచ్పి పెట్రోల్ బంకులో ఘరానా మోసం బయటపడింది. రూ.100 పెట్రోలు అడిగితే అర లీటరు మాత్రమే రావడంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు. కాళ్ళ గ్రామానికి చెందిన ఎం.సూరిబాబు తన వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో ఆగిపోయింది. దగ్గరలో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకుకు వెళ్లి బాటిల్లో రూ. 100 పెట్రోల్ పట్టమని చెప్పాడు. మెషిన్లో ఫీడ్ చేసి బాటిల్లో పట్టిన తర్వాత బాటిల్ అర లీటర్ మాత్రమే ఉండడంతో విస్తుపోయాడు. మెషీన్ చూస్తే 0.91 లీటర్ చూపుతోందని బంక్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరొక వ్యక్తి వచ్చి బాటిల్లో పెట్రోల్ పట్టమనడంతో మరలా అదేవిధంగా అర లీటరు మాత్రమే వచ్చింది. పలువురు వాహనదారులు బంకు యాజమాన్యం చేస్తున్న ఘరానా మోసంపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లో మోసాలను తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు.