Admissions: అడ్మిషన్లలో కార్పొ‘రేట్’ దందా..
ABN , Publish Date - Apr 11 , 2025 | 09:51 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని పాఠశాలలు, కాలేలు అప్పుడే అడ్మిషన్ల కోసం తమతమ ప్రచారాలను ప్రారంభించాయి. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో గ్రేటర్లోని పలు పేరొందిన రెసిడెన్షియల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల దందాకు తెరలేపాయి.

- కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ అధిక ఫీజులు
- రూ.లక్షల్లో ఉండడంతో సామాన్యులకు ఇబ్బందులు
- షెడ్యూల్ రాకముందే యాజమాన్యాల బేరసారాలు
హైదరాబాద్ సిటీ: పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో గ్రేటర్లోని పలు పేరొందిన రెసిడెన్షియల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల దందాకు తెరలేపాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభానికి రెండు నెలల ముందే బేరసారాలు సాగిస్తున్నాయి. మిగిలిన సీట్లను భర్తీ చేసుకునే క్రమంలో కొన్ని యాజమాన్యాలు హఠాత్తుగా కృత్రిమ డిమాండ్ను సృష్టించి ఇష్టారాజ్యంగా రేట్లను పెంచుతున్నాయి. గ్రేటర్లోని హైదరాబాద్ జిల్లాలో 285 ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Water: రేపు ఆ ప్రాంతాలకు గోదావరి నీళ్లు బంద్..
అలాగే రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో 180, మేడ్చల్లో 126 ప్రైవేట్ విద్యాసంస్థలు కొనసాగు తున్నాయి. కాగా, మూడు జిల్లాల్లో కలిపి పేరొందిన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు 320 వరకు ఉన్నాయి. నగర పరిధిలో కొన్నేళ్ల నుంచి నడుస్తున్న ఈ కళాశాలల్లో ఏటా అత్యుత్తమ ర్యాంకులు వస్తుండడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడే చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
మొన్నటి వరకు రూ.1.50 లక్షలే
గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కాలేజీల్లో ఈనెల 2వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్కు రూ.1.50 లక్షలు మాత్రమే తీసుకున్నారు. రెండేళ్ల ఫీజును ఒకేసారి మాట్లాడుకుంటే రూ.2.70లక్షలు తీసుకుంటామని ప్రచారం చేశారు. దీంతో పిల్లల అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. డిమాండ్ పెరుగుతుండడంతో రెండు రోజుల నుంచి ఫీజులను మళ్లీ పెంచేశారు. ఉదాహరణకు కొండాపూర్(Kondapur)లోని ఓ కాలేజీలో వారం క్రితం సీ-120 బ్రాంచి ఫస్టియర్ ఏసీ క్యాంప్సలో ఫీజు రూ.1.50 లక్షలు తీసుకున్నారు. అదే కాలేజీలోని సీటుకు మంగళవారం రూ.2 లక్షలు అడిగారు. కాగా, సూపర్చైనా బ్రాంచికి రూ.2.50 లక్షల ఫీజు ఉందని చెబుతున్నారు. మియాపూర్లోని మరో కాలేజీలో ఫస్టియర్కు రూ.2.40 లక్షలు ఉండడంతో ఆయా కాలేజీలకు వెళ్తున్న తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
చర్యలు లేకపోవడంతో..
పేరొందిన కాలేజీల్లో చదివిస్తే తమ పిల్లలకు భవిష్యత్ ఉంటుందని భావిస్తున్న నిరుపేద తల్లిదండ్రులకు కార్పొరేట్ యాజమాన్యాలు విధిస్తున్న ఫీజులు భారంగా మారుతున్నాయి. కరోనాకు ముందు ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్కు రూ.80 వేల నుంచి రూ.లక్ష ఉన్న ఫీజును ఇప్పుడు ఏకంగా రూ.2లక్షలకు పైగా వసూలు చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫీజుల నియంత్రణపై ఫిర్యాదులు అందుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో కొన్ని యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
Read Latest Telangana News and National News